కెజిబివి విద్యార్థినీ యోగ్యశ్రీ
విశాలాంధ్ర,సీతానగరం: రాజీవ్ గాంధీ విజ్ఞాన సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటి) ఆధ్వర్యాన నిర్వహించే ట్రిపుల్ ఐటీకు మండలంలోని జోగమ్మపేట కెజిబివి విద్యార్థినీ బురిడి యోగ్యశ్రీ ఎంపికైనట్లు స్పెషల్ ఆఫీసర్ జొన్నాడ సంధ్యారాణి తెలిపారు. మార్చినెలలో జరిగిన పదోతరగతి పరీక్షలో బురిడి యోగ్యశ్రీ 573మార్కులు సాధించిన సంగతి తెలిసిందే. జిల్లా స్థాయిలో జరిగిన ఆణిముత్యంలో 50వేల రూపాయల నగదును ప్రశంసా పత్రాలను జిల్లా కలెక్టర్ నిషాంత్ కుమార్, జిల్లా విద్యాశాఖాదికారి ప్రేమ్ కుమార్ ల చేతుల మీదుగా మండల, స్కూలుస్థాయిలో కూడా ఆమె ప్రశంసలు అందుకున్నారు.బగ్గందొరవలస గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబం బురిడి తేజోవతి, త్రినాధరావుల పెద్దకుమార్తె యోగ్యశ్రీ చిన్నపుడు నుండి క్రమశిక్షణతో చదవడం, కెజిబివిలో స్పెషల్ ఆఫీసర్ హరిత,ఉపాధ్యాయసిబ్బంది శైలజ,భవానీ, సుజాత తదితరుల పర్యవేక్షణలో చదవడంవల్ల మంచి మార్కులు వచ్చాయని తల్లిదండ్రులు తెలిపారు. తమ రెండోఅమ్మాయి కూడా జోగమ్మపేట కెజిబివిలో 9వ తరగతి చదువుతున్నట్లు తెలిపారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీ కు ఎంపికైన యోగ్యశ్రీను స్పెషల్ ఆఫీసర్ సంధ్యారాణి, కెజిబివి ఉపాధ్యాయ సిబ్బంది, తల్లిదండ్రులతోపాటు బగ్గందొరవలస గ్రామపెద్దలు అభినందించారు. యోగ్యశ్రీ పాటశాల తరపున మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరిగిన విజ్ఞాన మేళాలో, పలు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని మంచి విద్యార్ధిగా నిలిచినట్లు పాఠశాల భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు శైలజా తెలిపారు.