. సీఎం జగన్ ప్రజలకు సమాధానం చెప్పాలి
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పేరుతో రుణంగా తీసుకున్న రూ.900 కోట్లను ప్రైవేటు గుత్తేదారుకు మళ్లించడంపై సమగ్ర విచారణ జరిపించాలని, ప్రాజెక్టు పనుల వివరాలు, నిధుల బదలాయింపులపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రాంతంలో కరవును నివారించేందుకు ఎత్తిపోతల పథకాల నిర్మాణం పేరుతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భారీ అవకతవకలు పాల్పడినట్లు తెలుస్తోంది. రూ.3,825 కోట్లతో రాయలసీమలో కరవు నివారణ కోసం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపడుతున్నామంటూ 70 శాతం అప్పుగా ఇవ్వాలని ఆర్ఈసీ, పీఎఫ్సీల నుంచి రూ.900 కోట్లు అప్పుగా తీసుకుంది. అలా రుణంగా తీసుకున్న రూ.900 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం నేరుగా అధికార పార్టీకి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి గుత్తేదారుగా ఉన్న సంస్థ ఖాతాలోకి పంపేసింది. ఏ పనుల కోసం నిధుల బదలాయింపు జరిగిందో, కనీసం ఆయా పనులు జరిగాయో లేదో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించుకోకుండా నిధులు ఇచ్చేయడం సరైందికాదు. ఇందులో భారీ కుంభకోణం ఉన్నట్లుగా గోచరిస్తున్నది. ఇలా ప్రజాధనం దుర్వినియోగంపై, రాష్ట్ర ఖజానా లెక్కలకు జవాబుదారీతనం లేకపోవడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నాం. ప్రభుత్వానికి వచ్చే ఆదాయమైనా, తీసుకునే అప్పులైనా మొదట కన్సాలిడేటెడ్ ఫండ్లోకి వచ్చిన తర్వాతే ఖర్చు పెట్టాలి. కనీసం రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల అభివృద్ధి సంస్థ ఖాతాలోకి కూడా ఆ నిధులు రాలేదు. అలాకాకుండా రాష్ట్ర ప్రభుత్వం అప్పుగా తీసుకున్న వందలాది కోట్ల రూపాయలను కేవలం మూడు రోజుల్లోనే ఒక గుత్తేదారు ఖాతాలోకి పంపటం నిబంధనలకు విరుద్ధం. ఇది ప్రజాధనాన్ని దోచిపెట్టటమే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దీనిపై తక్షణమే స్పందించి రాయలసీమ కరవు నివారణ ప్రాజెక్టుల పనులకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడిరచాలి. రూ.900 కోట్ల మళ్లింపు అవకతవకలపై నిజానిజాలు వెలికితీయాలి. దీనిపై సమగ్ర విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.