. దిగ్భ్రాంతి కలిగిస్తున్న ఖైదీల మరణాల గణాంకాలు
. వారి మానసిక ఆరోగ్యంపై పాలకుల నిర్లక్ష్యం
. పీఎస్ఐ నివేదిక వెల్లడి
న్యూదిల్లీ : దేశంలోని జైళ్లలో ఖైదీలు అసహజ మరణాలకు గురవుతున్నారు. 2021లో దేశంలోని జైళ్లలో ‘అసహజ కారణాల’ వల్ల సంభవించే ప్రతి ఐదు మరణాలలో నాలుగు ఆత్మహత్యలే కావడం దిగ్భ్రాంతి గొల్పుతోంది. ది ప్రిజన్ స్టాటిస్టిక్స్ ఇండియా (పీఎస్ఐ) 2021, జైళ్లు, వాటి పరిపాలనపై జాతీయ నేర నమోదు సంస్థ (ఎన్సీబీ) తాజా నివేదికలో ఈ సంఖ్యలు వెల్లడయ్యాయి. నివేదిక ఆత్మహత్యలను ‘అసహజ మరణాలు’ కింద పేర్కొంది. జైలు ఖైదీలు ఆత్మహత్య చేసుకునే కొన్ని సాధారణ పద్ధతులను గుర్తిస్తుంది. నివేదిక ప్రకారం, 2021 సంవత్సరంలో కస్టడీలో మరణించిన 2,116 మంది ఖైదీలలో 185 మరణాలు ‘అసహజ కారణాల’ వల్ల సంభవించాయి. అలాంటి మరణాలకు ఆత్మహత్యలే అధిక కారణం, 150 మరణాలకు దారితీసింది. ఆత్మహత్యల కారణంగా ఉత్తరప్రదేశ్లో అత్యధిక మరణాలు నమోదయ్యాయి. 2021లో రాష్ట్రంలో 34 మంది ఖైదీలు ఆత్మహత్య చేసుకున్నారు. కామన్వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనిషియేటివ్ (సీహెచ్ఆర్ఐ) నివేదిక ప్రకారం, 2019 పీఎస్ఐ గణాంకాల ఆధారంగా ఖైదీలలో ఆత్మహత్య రేట్లు దేశంలోని సాధారణ జనాభాలో నమోదయిన దాని కంటే రెండు రెట్లు ఎక్కువ. జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఖైదీలు ఉద్దేశపూర్వకంగా స్వీయ హాని, ఆత్మహత్యలను తగ్గించే ఉద్దేశంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) జూన్ 19న ఒక సలహా జారీ చేసింది. ఖైదీల ఆత్మహత్యలు, స్వీయ హాని నివారణకు సంబంధించి మూడు నెలల వ్యవధిలో అవసరమైన చర్యలు తీసుకోవాలని, నివేదికలను సమర్పించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను నిర్దేశించింది. జైళ్లలో ‘అసహజ మరణాలు’ అధిక శాతంగా ఉన్నాయని, అలాంటి 80 శాతం మరణాలకు ఆత్మహత్యలే ప్రధాన కారణం. సలహా ప్రకారం, జైళ్లలో ఆత్మహత్యాయత్నానికి దారితీసే అనేక కారణాలలో వైద్య, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఖైదీల ఆరోగ్యం, భద్రతను కాపాడే బాధ్యత జైలు అధికారులదే అయినందున, ఆత్మహత్యల రేటు ఎక్కువగా ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్హెచ్ఆర్సీ ప్రధానంగా ప్రస్తావించింది. సలహా ప్రకారం, ఆత్మహత్య ద్వారా మరణాన్ని అరికట్టడానికి భారతదేశం అంతటా జైలు అధికారులు తీసుకోవలసిన విస్తృత చర్యలు క్రింది విధంగా ఉన్నాయి. మానసిక ఆరోగ్యంపై చట్టాలు, నిబంధనలకు, ప్రత్యేకించి మెంటల్ హెల్త్కేర్ యాక్ట్`2017, మెంటల్ హెల్త్కేర్ (మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల హక్కులు) రూల్స్, 2018లోని నిబంధనలకు రాష్ట్ర ప్రభుత్వాలు, జైలు పరిపాలనలు కట్టుబడి ఉండాలని సలహా సిఫార్సు చేస్తోంది. మానసిక ఆరోగ్య స్థాపన కోసం ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం కనీసం ఒక జైలును గుర్తించాలని కూడా ఇది సలహా ఇస్తుంది. ఈ నిబంధన ప్రకారం, జైలు వైద్య అధికారి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీల సంఖ్యపై త్రైమాసిక నివేదికను మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డులకు (ఎంహెచ్ఆర్బీలు) పంపాల్సి ఉంటుంది. ఒక వార్తా కథనం ప్రకారం, త్రిపుర, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్- కేవలం మూడు రాష్ట్రాలు మాత్రమే ఎంహెచ్ఆర్బీలను ఏర్పాటు చేశాయి. మానసిక ఆరోగ్య సంరక్షణ (మానసిక అనారోగ్యం ఉన్న వ్యక్తుల హక్కులు) నియమాల షెడ్యూల్ ప్రతి 500 మంది ఖైదీలకు ఒక వైద్యుడు, ఇద్దరు నర్సులు, నలుగురు కౌన్సెలర్లను అందిస్తుంది. అయితే నివేదిక ప్రకారం, జులై 2021 నాటికి 21 రాష్ట్రాలు జైళ్లలో మనస్తత్వవేత్తలు లేదా మనోరోగ వైద్యులు లేరు. ప్రతి 16,503 మంది ఖైదీలకు ఒక సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ ఉన్నారు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2022 ప్రకారం, జైళ్లలో క్వాలిఫైడ్ డాక్టర్ల ఖాళీలు 2019లో 37 శాతం నుంచి 2021లో 48 శాతానికి పెరిగాయి. 11 రాష్ట్రాల్లో 1,000 మంది ఖైదీలకు ఒక డాక్టర్ ఉండగా, మరో ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న జైళ్లలో వైద్యులు లేరని నివేదిక వెల్లడిరచింది. 2021లో దేశవ్యాప్తంగా 1,319 జైళ్లకు, 5.5 లక్షల మంది ఖైదీలకు 69 మంది సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్ట్లు మంజూరైనా కేవలం 33 మంది మనస్తత్వవేత్తలు మాత్రమే నిమగ్నమై ఉన్నారని నివేదిక పేర్కొంది. 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు మానసిక వైద్యుల నియమాకాలకు సంబంధించి ఎటువంటి నిబంధనలు పాటించడం లేదని తెలిపింది.
తెలంగాణాలో తొలిసారి వైద్య పరీక్షలు
ఆగస్టు 2018లో సంగారెడ్డి జిల్లా జైలులో ఖైదీల మానసిక ఆరోగ్యానికి సంబంధించి భారతదేశపు మొట్టమొదటి సైకలాజికల్ స్క్రీనింగ్ను తెలంగాణ జైలు శాఖ నిర్వహించింది. పరీక్షించిన వారిలో దాదాపు 25 శాతం మంది ఆందోళన కలిగి ఉన్నారు. 51 శాతం మంది ఉన్మాదంతో బాధపడుతున్నారు. ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) సెంటర్ ఫర్ క్రిమినాలజీ అండ్ జస్టిస్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ రాఘవన్, న్యాయపరమైన, పునరావాస న్యాయాన్ని అందించే ఫీల్డ్ యాక్షన్ ప్రాజెక్టు డైరెక్టర్ ప్రయాస్… ఎన్హెచ్ఆర్సీ వంటి ‘ముఖ్యమైన సంస్థ’ ఖైదీలు ఎదుర్కొన్న మానసిక ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవడం ‘మంచి మొదటి అడుగు’ అని వివరించారు. సీహెచ్ఆర్ఐ జైలు సంస్కరణల కార్యక్రమం ప్రధానాధికారి మధురిమ ధనుక మాట్లాడుతూ ఎన్హెచ్ఆర్సీ సలహాను ‘స్వాగతించే చొరవ’ అని కూడా అభివర్ణించారు. ప్రత్యేకించి మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న ఖైదీల సంఖ్య 2015లో 5,203 మంది నుంచి 2021 నాటికి 9,180 మందికి పెరిగిందని గణాంకాలు పేర్కొంటున్నాయి. మొదటి స్థాయిలో ఖైదీలను క్రమం తప్పకుండా గమనించాలని, స్నేహితులు, కుటుంబ సభ్యులతో వారి టెలిఫోనిక్ సంబంధాన్ని నిర్ధారించాలని ఇది సిఫార్సు చేస్తుంది. ప్రతి జైలులో తగిన సంఖ్యలో టెలిఫోన్లను ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. రెండవ స్థాయిలో అధిక ముప్పు కలిగిన ఖైదీలను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ అందించే ప్రాంగణాలకు మార్చాలని, ఆత్మహత్యకు ఉపయోగించే ఏదైనా సామాగ్రి లభ్యతను నిరోధించాలని, దర్యాప్తు కోసం ఆత్మహత్యకు ప్రయత్నించిన ప్రదేశాన్ని సురక్షితంగా ఉంచాలని సలహా సిఫార్సు చేస్తుంది. అలాగే, ఖైదీల మద్యం వ్యసనం సమస్యపై ఎన్హెచ్ఆర్సీ మానసిక ఆరోగ్య సంరక్షణ నిపుణులు, డి-అడిక్షన్ నిపుణులను క్రమం తప్పకుండా సందర్శించాలని సలహా ఇవ్వడంతో పాటు ఈ సమస్యను ఆరోగ్యం, పునరావాసానికి సంబంధించిన అంశంగా చూడాలనేగానీ, భద్రతకు సంబంధించిన అంశంగా పరిగణించకూడదని సూచించింది. మానసిక క్షీణత సంకేతాలను గుర్తించడానికి, జైలు ఖైదీలకు ప్రత్యేక సేవలను అందించడానికి పారామెడికల్ సిబ్బంది, శిక్షణ పొందిన సామాజిక కార్యకర్తలను నిమగ్నం చేయవలసిన అవసరాన్ని డాక్టర్ రాఘవన్ నొక్కి చెప్పారు. ఖైదీల మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి పౌర సమాజాన్ని భాగస్వామ్యం చేయవలసిన అవసరాన్ని మధురిమ ధనుక అంగీకరించారు. ‘ఖైదీలు ఇకపై మన సమాజంలో భాగం కాదని జైలు గోడలు మమ్మల్ని ఒప్పించకూడదు’ అని ఆమె అన్నారు.