మణిపూర్ లో కొంతకాలంగా జరుగుతున్న హింసపై ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గురువారం పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని.. కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై మోదీ స్పందించారు. ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. బాధ్యులు ఎవరైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో మణిపూర్ విషయంలో ఇప్పటివరకూ మౌనంగా ఉంటున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న మోడీ..ఇప్పుడు ఏం చేయబోతున్నారనే చర్చ సాగుతోంది. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన భయానక వీడియో బుధవారం వైరల్ అయింది. దీంతో తన హృదయం బాధతో నిండిపోయిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మణిపూర్ ఆడబిడ్డలకు జరిగిన ఘోరాన్ని ఎప్పటికీ క్షమించలేమన్నారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, దోషులను వదిలిపెట్టబోమని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.