విశాలాంధ్ర – భద్రాద్రి : గోదావరి నది ప్రవాహం ఉధృతంగా ఉంది. శనివారం ఉదయం 7గంటలకు 39.4 అడుగులకు చేరిన స్థాయి సాయంత్రానికి 40.08 అడుగులకు పెరిగింది. ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి నీటిని విడుదల చేస్తుండటంతో పాటు తాలిపేరు, ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుంచి వరద నీరు వచ్చి కలుస్తుండటంతో గోదావరి భద్రాచలం వద్ద వరదకాడికి పెరిగింది. ఆదివారం ఉదయానికి మొదటి ప్రమాదహెచ్చరిక 43న అడుగులు, సాయంత్రానికి 48 అడుగుల రెండో ప్రమాద హెచ్చరికను దాటి 50 అడుగులపైబడి వరద వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
గోదావరి ఉధృతి పెరగొచ్చు జాగ్రత్త: పువ్వాడ అజయ్
ఎడతెరిపిలేని వానలతో జలాశయాలన్ని నిండుకుండాలుగా మారాయి. గోదావరి ఉధృతి పెరుగుతోంది కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. గోదావరి వరదలపై ఆయన శనివారం ఐటీసీ పీఎస్ పీడీ గెస్ట్హౌస్లో జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి, వరదల ప్రత్యేకాధికారులు అనుదీప్. కృష్ట, గౌతం పోట్రు, జిల్లా ఎస్పీ వినీత్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ వరదలపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు తెలిపారు. వరదల వల్ల ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చూడాలన్నారు. భద్రాచలం వద్ద వరద హెచ్చు తగ్గులను గమనించాలని, నివాస ప్రాంతాల్లో అంటు వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య, వైద్య కార్యక్రమాలపై సంబంధిత అధికారులు దృష్టి సారించాలన్నారు. దోమల నివారణకు మురుగు తొలగించి దోమల మందుతో పాటు బ్లీచింగ్ పిచికారీ చేయాలని సూచించారు. ప్రజలకు సురక్షిత మంచినీటిని అందించాలని, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలన్నారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి అన్ని సదుపాయాలు కల్పించాలని మంత్రి సూచించారు. పోలీస్ యంత్రంగా సైతం నిత్యం ఆయా ప్రాంతాల్లో గస్తీకాస్తూ ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పట్టనందున జలాశయాల్లోనికి వచ్చే నీరంతా గోదావరికి చేరనుండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో సమాచారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్లకు ప్రజలు ఫోన్ చేయొచ్చని మంత్రి తెలిపారు.