అప్పుడే పుట్టిన బిడ్డను వదిలివెళ్లిన తల్లి
విశాలాంధ్ర`వినుకొండ: అప్పుడే పుట్టిన పసికందును ఆర్టీసీ బస్టాండ్ లోని టాయిలెట్ లో వదిలేసి వెళ్లిందో మహా తల్లి. పల్నాడు జిల్లా వినుకొండలో ఈ ఘటన శనివారం రాత్రి వెలుగుచూసింది. నవజాత శిశువును చూసిన స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆర్టీసీ డిపోలో హెల్పర్ గా విధులు నిర్వహిస్తున్న జనావత్ రవీంద్ర నాయక్ టాయిలెట్ లో బిడ్డ ఏడుపు వినిపించటంతో వెళ్లి చూడగా… నవజాత ఆడ శిశువు టాయిలెట్ బేసిన్ లో ఏడుస్తూ కనిపించింది. వెంటనే వినుకొండ పోలీసులకు సమాచారం ఇచ్చి స్థానిక మహిళల సహాయంతో శిశువును వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని పాపను పీడియాట్రిక్ సూపర్విజన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్ రజాక్ తెలిపారు. సమాచారం తెలుసుకున్న వినుకొండ సీఐ సాంబశివరావు, ఎస్సై స్వర్ణలత ప్రభుత్వ వైద్యశాలకు చేరుకొని శిశువు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఆర్టీసీ డిపోలో ఉన్న సీసీ ఫుటేజీల ఆధారంగా శిశువును ఆర్టీసీ టాయిలెట్లో వదిలి వెళ్లిన వారి ఆచూకీ కోసం విచారణ చేపడుతున్నారు.