విశాలాంధ్ర – ఆస్పరి : మణిపూర్ రాష్ట్రంలో మహిళలలను నగ్నంగా ఊరేగించిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని, మణిపూర్ రాష్ట్రంలో జరుగుతున్న అల్లర్లను అరికట్టాలని, బీజేపీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసి రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక బస్టాండ్ దగ్గర విద్యార్థినీలతో కలిసి పెద్ద ఎత్తున రాస్తారోకో కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుండి బస్టాండ్ వరకు విద్యార్థినీలతో పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ నాయకులు రేవన్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ మండల కార్యదర్శులు రమేష్, ఈశ్వర్ లు మాట్లాడుతూ మణిపూర్ లో జరిగిన అమానవీయ సంఘటనపై సుప్రీం కోర్టు జడ్జీలతో విచారణ జరిపి నిందితులను ఉరి తీయాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశంలోని ముస్లిం, క్రిస్టియన, దళిత, గిరిజన వర్గాల ప్రజలకు రక్షణ కరువైందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు పాల్గొన్నారు.