విశాలాంధ్ర`తుళ్లూరు: రాజధాని రైతులు, రైతు కూలీలు, మహిళలు నల్లజెండాలు, బలూన్లతో సీఎం జగన్కు నిరసన తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాజధాని అమరావతిలోని కృష్ణాయపాలెంలోని స్థలాల్లో గృహ నిర్మాణాలకు శంకుస్థాపన, వెంకటపాలెంలో బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షా శిబిరాలలో వివిధ రూపాల్లో నిరసన తెలిపారు. తుళ్లూరు, వెంకటపాలెం దీక్షా శిబిరంలో మహిళా, రైతులు కళ్ళకు నల్లరిబ్బన్లు కట్టుకొని సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. నల్లజెండాలు పట్టుకుని నల్ల బలూన్లు ఎగురవేస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతుల కష్టార్జితమైన భూముల్ని తన పార్టీ కార్యకర్తలకు దోచిపెడుతున్నారని మండిపడ్డారు. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు తమ సొంత భూములను పేదలకు పంచి వారిపై ప్రేమను చాటాలని హితవు పలికారు. చెల్లుబాటు కాని ఇళ్లను నిర్మించి పేదలను మోసం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సభ ముగిసిన అనంతరం సభాస్థలి నుంచి బస్సులు తిరిగి వెళుతున్న సమయంలో దీక్షా శిబిరం నుంచి రైతులు, మహిళలు రోడ్డుపైకి వచ్చి జోరు వర్షంలోనూ నిరసన తెలిపారు. బిల్డ్ అమరావతి-సేవ్ ఆంధ్రప్రదేశ్ అంటూ నినాదాలు చేశారు. మందడం దీక్షా శిబిరంలోనూ రైతులు నిరసన తెలిపారు. మందడం రైతు దీక్షా శిబిరంలో రైతులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఓట్లు కోసమే ఇళ్ళ స్థలాల పంపిణీ అంటూ ఆర్భాటం చేస్తున్నారని మండిపడ్డారు. మా సమాధులపై నడుచుకుంటూ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా సీఎం సభ నేపథ్యంలో దళిత జేఏసీ నాయకుడు పులి చిన్నా సహా మరికొందరని పోలీసులు గృహ నిర్భంధంలో ఉంచారు. తాము కోర్టుకు హాజరు కావాల్సి ఉందని చెప్పడంతో సీఎం కార్యక్రమాలు జరుగుతున్న మార్గంలో కాకుండా వేరే మార్గంలో వెళ్లాలని సూచిస్తూ వారిని వదిలేశారు.