విశాలాంధ్ర, పెద్దకడబూరు : మండలంలో మంగళవారం ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతం అయింది. ఈ సందర్భంగా మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరి బా గాంధీ గురుకుల విద్యాలయం, ఆదర్శ పాఠశాలలను ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు స్వచ్ఛందంగా బంద్ చేయించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ తాలూకా అధ్యక్షులు ఈరేష్, ఏఐవైఎఫ్ తాలూకా అధ్యక్షులు జాఫర్ పటేల్, టిఎన్ఎస్ఎఫ్ తాలూకా కార్య నిర్వహక కమిటీ కార్యదర్శి హనుమంతు మాట్లాడుతూ జగన్ ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. వైసీపీ ప్రతి పక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికీ అమ్మ ఒడి ఇస్తానని, హాస్టల్ విద్యార్థులకు, పాఠశాల విధ్యార్థులకు సన్నబియ్యం సరఫరా చేస్తానని, పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్ మెంట్ విడుదల చేస్తానని, ప్రతి సంవత్సరం జాబు క్యాలెండరు, మెగా డిఎస్సీ విడుదల చేస్తానని నమ్మబలికి విద్యార్థుల ఓట్లతో అధికారాన్ని చేపట్టిన జగన్, నాలుగు సంవత్సరాలు కావస్తున్నా ఇచ్చిన హామీలను ఏఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తక్షణమే విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులు షేక్ అల్లబకాష్, జయకృష్ణ, హరీకృష్ణ, రామాంజనేయులు, టిఎన్ఎస్ఎఫ్ నాయకులు విల్సన్, బాబు తదితరులు పాల్గొన్నారు.