. పేదలకు ఉపాధి చూపండి
. జల్లి విల్సన్, ఆవుల శేఖర్ డిమాండ్
విశాలాంధ్ర`జంగారెడ్డిగూడెం : మిగులు భూములు పేదలకు పంచాలని, పేదలకు ఉపాధి చూపాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జల్లి విల్సన్, ఆవుల శేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా ప్రథమ మహాసభ స్థానిక ఆలపాటి గంగా భవానీ కల్యాణ మండపంలో మంగళవారం జరిగింది. బత్తుల వెంకటేశ్వరరావు, మడివి కామయ్య, తాళ్లూరి రత్నం అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. వ్యవసాయ కార్మికసంఘం జెండాను సంఘం జిల్లా గౌరవా ధ్యక్షులు బోడా వజ్రం ఆవిష్కరించారు. ఆవుల శేఖర్ మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా పేదల బ్రతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పేద, బడుగు, బలహీన వర్గాల జీవితాలలో సంతోషకర దినాలు లేవన్నారు. గ్రామీణ పేదల హక్కులు కాపాడుకోవడానికి ఐక్యంగా ఉద్య మించాలన్నారు. కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసుల్లో 92 అంశాలను నాటి వైఎస్ ప్రభుత్వం ఆమోదించినా నేటికీ అమలు కాలేదన్నారు. ఏలూరు జిల్లాలో పోడు భూముల సమస్య నేటికీ అపరిష్కృతంగా ఉందన్నారు. వివిధ రూపాలలో ఉద్యమాలు చేసినా ప్రభుత్వం నుంచి స్పందన లేదన్నారు. దీనిపై త్వరలో కార్యాచరణ రూపొందించి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని తెలిపారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు పైగా మిగులు భూమి ఉందని, ప్రతి నిరుపేదకు మూడెకరాలు పంచితే వారి జీవితాలలో వెలుగులు వస్తాయన్నారు. ప్రధాని మోదీ అధికారం చేపట్టిన తరువాత ఉపాధి హామీ పథకానికి నామమాత్రపు నిధులు కేటాయించి… పథకాన్ని నిర్వీర్యం చేయడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న అటవీ బంజరు భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అటవీ హక్కుల చట్టం అమలు చేయాలని, లేనిపక్షంలో పోరాటాలు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్ మాట్లాడుతూ 90 ఏళ్లుగా ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర వ్యవసాయ కార్మిక సంఘానికి ఉందన్నారు. న్యాయమైన కూలీ రేట్ల సాధన కోసం పోరాటాలు సాగించామన్నారు. కోండ్రు సుబ్బారావు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు 1960లో శాసనమండలిలో ఇళ్లస్థలాల కోసం పోరాడి విజయం సాధించారని గుర్తుచేశారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతంలో 2 సెంట్లు పేదలకు ఇవ్వాలని, ప్రభుత్వమే ఇల్లు నిర్మించాలని కోరారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షలతోపాటు ఇసుక, ఇనుము, ఇటుక ప్రభుత్వమే ఉచితంగా అందజేసి…పేదవాడి సొంతింటి కల సాకారం చేయాలని డిమాండ్ చేశారు. ప్రతి సమస్యకు వలంటీర్లపై, సచివాలయాలపై ఆధారపడకుండా కార్యకర్తలు గ్రామీణ ప్రాంతాలలో పర్యటించి నేరుగా సచివాలయాలకు విజ్ఞాపన పత్రాలు అందజేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పేదవాడికి సామాజిక గౌరవం, శాశ్వతమైన జీవన భృతి కల్పించాలని, పేదలుసాగు చేసుకుంటున్న భూమికి పట్టాలు మంజూరు చేయాలని, పోరాటాలలో వ్యవసాయ కూలీలు పెద్దఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఆగస్ట్ 24, 25, 26 తేదీలలో బాపట్లలో జరిగే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం 22వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో అనాదిగా సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుపత్రాల కోసం ఉద్యమాలు చేసినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని విమర్శించారు. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు హక్కుపత్రాలు ఇవ్వకపోతే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. జంగారెడ్డిగూడెంలో మిగులు భూములు వెలికితీసి పేదలకు పంపిణీ చేయడానికి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఉద్యమాల ఫలితంగా టీ. నర్సాపురం, చింతలపూడి, కామవరపుకోటలో వన సంరక్షణ సమితులు ఏర్పాటు చేశామని, దీని ద్వారా పేదలు భూములు సాగు చేసుకుంటున్నారని తెలిపారు..అనంతరం కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టగా మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. తొలుత బండి వెంకటేశ్వరరావు సంతాప తీర్మానం ప్రవేశపెట్టగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. మహాసభలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మైసాక్షి వెంకటాచారి, బాడిస రాము, జమ్మి శ్రీనివాసరావు, కంచర్ల గురవయ్య, జేవీ రమణరాజు, ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కారం దారయ్య, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జంగారెడ్డిగూడెం మండల కార్యదర్శి గొలిమే బాలయేసు, సీపీఐ మండల సహాయ కార్యదర్శి కుంచె వసంతరావు, వ్యవసాయ కార్మికులు పాల్గొన్నారు.