. ప్రతిపాదించే యోచనలో ఇండియా
. ప్రధాని పెదవి విప్పేలా చేసేందుకు ఇదే మంచి మార్గం
. రాజ్యసభలోనూ ఒత్తిడి పెంచేలా ప్రతిపక్షాల వ్యూహం
. అవునా… గతంలో జరిగింది మరిచారా : జోషి ఎద్దేవా
న్యూదిల్లీ: మణిపూర్ పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలన్న డిమాండ్ను అధికార పక్షం ఎంతకూ అంగీకరించకపోవడంతో లోక్సభలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రతిపక్షం నిర్ణయించింది. ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ మంగళవారం భేటీ అయి ఈ ప్రతిపాదనపై చర్చించింది. ప్రధానమంత్రి సభలో పెదవి విప్పేలా చేయడానికి ఇది మంచి మార్గం అని ప్రతిపక్షాలు భావించాయి. అటు రాజ్యసభలోనూ ఒత్తిడి తెచ్చేలా వ్యూహాన్ని కొనసాగించనున్నాయి. తాజా పరిణామంపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ ‘నాకు దీని గురించి తెలియదు. కానీ వారు నిజంగా అలా చేయాలని భావిస్తేగనుక గతసారి అవిశ్వాస తీర్మానం పెట్టినప్పుడు 300కుపైగా సీట్లను గెలుచుకొని బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే జరుగుతుంది. 350కుపైగా స్థానాల్లో గెలుస్తుంఇ’ అని అన్నారు. 2018, జులై 20న లోక్సభలో తొలిసారి మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అవిశ్వాస తీర్మానానికి 126 మంది మాత్రమే అనుకూలంగా ఓటు వేయగా 325 మంది ఎంపీలు ఎన్డీయేకు మద్దతిచ్చారు. లోక్సభలో మొత్తం 543 స్థానాలు ఉన్నాయి. ఇందులో ఐదు ఖాళీగా ఉన్నాయి. ఎన్డీయేకు 330 మంది సభ్యులు ఉంటే ఇండియాకు 140 మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఈ రెండు వర్గాలతో పొత్తు లేని పార్టీలకు 60 మందికిపైగా సభ్యులు ఉన్నారు. ఇదిలావుంటే, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్కర్ 267వ నిబంధన కింద 50 మంది సభ్యులు ఇచ్చిన నోటీసును ఆమోదించారు. సభలో చర్చ జరగడానికి ముందు ప్రధానమంత్రి మణిపూర్ పరిస్థితిపై ప్రకటన చేయాలని ప్రతిపక్షాలు పట్టుపట్టకుండా ఉంటే చర్చకు అవకాశం ఉంటుంది. ధన్కర్ రాజ్యసభకు అధ్యక్షులైన తర్వాత 267వ నిబంధన కింద ఒక్కసారి కూడా చర్చకు అంగీకరించలేదు. ఈ నిబంధన కింద చర్చ అంటే సభా కార్యకలాపాలకు భంగం కలిగించే ఎత్తుగడ అని ఆయన అభిప్రాయం. సభ్యులు ఎంత సమయం మాట్లాడాలన్న నియమం లేకుండా చర్చ లేకుండా ఉండాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఈ నిబంధన ప్రకారం చర్చ అంటే మిగతా సభా కార్యక్రమాలన్నింటినీ వాయిదా వేయవలసి ఉంటుంది. అలా కాకుండా 176వ నిబంధన కింద చర్చకు అనుమతించినట్టయితే రెండున్నర గంటల పాటు మాత్రమే చర్చకు అవకాశం ఉంటుంది. 276వ నిబంధన కింద చర్చకు అనుమతిస్తే 176వ నిబంధనను పట్టించుకోనవసరం లేదు.