ప్రమాణ స్వీకారం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
హాజరైన జగన్, చంద్రబాబు తదితరులు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్తో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి (పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, హోంశాఖ మంత్రి తానేటి వనిత, జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు, శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు, డిప్యూటీ చైర్మ్న్ జకియా ఖానమ్, సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ కెేవీ రాజేంద్రనాథ్రెడ్డి, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రజాప్రతినిధులు, న్యాయవాదులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్కి పుష్పగుచ్చం ఇచ్చి సీఎం జగన్ అభినందనలు తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు కూడా సీజేకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హై టీ కార్యక్రమంలో గవర్నర్ నజీర్, జగన్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పాల్గొన్నారు.
జస్టిస్ ధీరజ్ సింగ్ నేపథ్యం
జమ్మూకశ్మీర్కు చెందిన జస్టిస్ ధీరజ్సింగ్ది న్యాయమూర్తుల కుటుంబం. ఆయన తండ్రి, సోదరుడు కూడా న్యాయమూర్తులుగా పనిచేశారు. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ తీర్థసింగ్ ఠాకూర్ సోదరుడే జస్టిస్ ధీరజ్సింగ్. న్యాయవర్గాల్లో అత్యంత సౌమ్యుడిగా, వివాదరహితుడిగా, సమర్థుడిగా జస్టిస్ ధీరజ్ సింగ్కు పేరుంది. ఇటీవల కాలం వరకు బాంబే హైకోర్టులో నంబర్ టూ స్థానంలో కొనసాగారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2026 ఏప్రిల్ 24న పదవీ విరమణ చేస్తారు.