. కూనవరం, ఎటపాక వద్ద గోదావరి ఉధృతి
. ముంపులో అనేక గ్రామాలు… నిలిచిన రాకపోకలు
. సురక్షిత ప్రాంతాలకు తరలుతున్న వరద బాధితులు
. కన్నెత్తి చూడని అధికార యంత్రాంగం
విశాలాంధ్ర – చింతూరు/కూనవరం : విలీన గ్రామాల ప్రజలు మళ్లీ వరద ముంపులో చిక్కుకున్నారు. శబరి, గోదావరి సంగమ స్థానమైన అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం వద్ద వరద ఉధృతి కొనసాగుతోంది. శుక్రవారం గోదావరి వరద 50 అడుగులకు చేరుకోగానే అనేక కాలనీలు నీట మునగడంతో మండల కేంద్రమైన కూనవరం దాదాపు ఖాళీ అయింది. అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గత ఏడాది వరద కష్టాలు తీరక ముందే మళ్లీ వరదలొచ్చాయి. గత ఏడాది 70 అడుగుల మేర గోదావరి వచ్చినప్పుడు కనీసం కన్నెత్తి చూడని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ దఫా కూడా అదే రీతిలో వ్యవహరిస్తోంది. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండి ఇప్పుడు ఆంధ్ర ప్రదేశ్లో విలీనమైన ఎటపాక, చింతూరు, వర రామచంద్రాపురం, కూనవరం మండలాల ప్రజల పరిస్థితి దయనీయంగా ఉంది. తాజాగా శబరి నది వరద పోటెత్తడంతో కూనవరం మండలంలో పదుల సంఖ్యలో గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ప్రజలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సురక్షిత ప్రాంతాలైన కొండలు, గుట్టలను వెతుకులాడుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది దాదాపు వారం రోజుల పాటు వరద నీటిలోనే మగ్గిన దృశ్యాలను తలచుకుని విలపిస్తున్న ప్రజలకు మళ్లీ ఇప్పుడు గోదావరి వరదలు ఆశనిపాతంలా తగిలాయి. శబరి, గోదావరి సంగమ స్థానమైన కూనవరంలో శుక్రవారం గోదావరి 50 అడుగులకు చేరుకోగానే అనేక కాలనీలు నీట మునిగాయి. ప్రజలు ఎడ్లబండ్లలో తమ సామాన్లు వేసుకుని ఇక్కడ సురక్షిత ప్రాంతంగా చెప్పుకునే కోతులగుట్టకు పయనమయ్యారు. అక్కడ డేరాలను ఏర్పాటు చేసుకుని ప్రాణాలను రక్షించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కూనవరం రోడ్లపై పడవలు తిరుగుతున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అవగతం చేసుకోవచ్చు. పంటలు వరుసగా రెండేళ్లు దెబ్బతిన్నాయి. మరో పక్క విజరురం మండలం పరిస్థితి దయనీయంగా ఉంది. ఎటు చూసినా వరద బీభత్సం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. విష పురుగుల మధ్య, వరద ముంపు ఆందోళన నడుమ ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. గత ఏడాది ముంపునకు గురైన సందర్భంలో ఇళ్లను శుభ్రం చేసుకునేందుకు వేలాది రూపాయలు ఖర్చు అయ్యాయి. మళ్లీ ఏడాది గడవక ముందే ఈ పరిస్థితి రావడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎటపాక మండలంలోని అనేక గ్రామాలను గోదావరి వరద చుట్టుముట్టింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఏమి చేయాలో పాలుపోని పరిస్థితుల్లో ప్రాణాలను రక్షించుకునేందుకు సర్వం వదిలేసి జనం పరుగులు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కనీసం జాలి చూపించడం లేదు. ప్రభుత్వం బాధ్యతలను మరిచి వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అటు పక్క తెలంగాణ ప్రభుత్వం మంత్రులను పంపి వరద బాధితులను పునరావాస కేంద్రాలకు చేరుస్తూ అక్కడ వసతులను కల్పించే పనిలో నిమగ్నమైతే ఆంధ్రా ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదన్న వేదన బాధితుల్లో వ్యక్తమవుతోంది. ఎవరో ఒకరు తమను ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.