ఆర్`5 జోన్ ఇళ్లకు బ్రేక్
. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
. అమరావతి జేఏసీ హర్షం
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి/తుళ్లూరు : అమరావతి రాజధానిలో పేదల ఇళ్ల నిర్మాణం చేపట్టిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి హైకోర్టులో షాక్ తగిలింది. ఆర్5 జోన్లో లబ్ధిదారులకు కేటాయించిన ఇళ్ల స్థలాల్లో నిర్మాణాలు చేపట్టవద్దని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం గురువారం మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ తీర్పుతో మరోసారి జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఇక్కడి ఇళ్ల నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. రాజధాని ఆర్ఐ
5 జోన్లో ఇళ్ల స్థలాల కోసం 1402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్లకు బదిలీ చేస్తూ ప్రభుత్వం గతంలో జీవోలు ఇచ్చింది. ఆ స్థలాల్లో దాదాపు 50 వేల మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. కృష్ణాయపాలెం లే అవుట్లో ఇటీవల సీఎం ఇళ్ల నిర్మాణ ప్రక్రియకు భూమి పూజ చేశారు. షేర్ వాల్ టెక్నాలజీతో
రూ.2.30 లక్షల వ్యయంతో పూర్తి చేసిన ఇంటి నమూనాను సీఎం ప్రారంభించారు. ఆ స్థలాల్లో ఇళ్ల నిర్మాణాలను నిలుపుదల చేయాలని కోరుతూ రాజధాని గ్రామాల రైతు సంఘాలు, రాయపూడి దళిత బహుజన సంక్షేమ జేఏసీ అధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయజులు, జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరితో కూడిన హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ తీర్పు చెప్పింది. అక్కడ ఇళ్ల నిర్మాణాలను నిలిపివేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ తీర్పును అమరావతి రాజధాని జేఏసీ స్వాగతించింది. టీడీపీ సైతం హైకోర్టు తీర్పును సమర్ధించింది. పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తల దించుకోవాలని వ్యాఖ్యానించారు.
న్యాయ దేవతకు మహిళా రైతుల నమస్కారం
ఆర్5 జోన్లో ఇళ్ల నిర్మాణాలను నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇవ్వడంపై అమరావతి రాజధాని జేఏసీ హర్షం వ్యక్తం చేసింది. రైతులతో చేసుకున్న ఒప్పందాలను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించిందని నాయకులు ఆరోపించారు. రాజకీయ దురుద్దేశంతోనే ఆర్
5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. ఆర్`5 జోన్ చట్ట వ్యతిరేకమని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. తుళ్లూరు, కృష్ణాయపాలెంలోని దీక్షా శిబిరంలో న్యాయదేవత బొమ్మ ఉంచి మహిళా రైతులు నమస్కరించారు. కాగా, ఆర్-5 జోన్లో ఇళ్ల నిర్మాణాలు ఆపాలంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో అమరావతి రైతులు తుళ్లూరులో టపాసులు కాల్చారు. స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు.