ముందస్తు బెయిల్ కోసం హైకోర్టుకు వెళ్లిన నేతలు
సోమవారం దాకా అరెస్టు చేయబోమని చెప్పిన ఏఏజీ
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం అంగళ్లులో జరిగిన ఘర్షణల కేసులో టీడీపీ నేతలు దేవినేని ఉమ, నల్లారి కిషోర్కుమార్ రెడ్డిలకు హైకోర్టులో ఊరట లభించింది. సోమవారం వరకు వారిద్దరినీ అరెస్టు చేయబోమని కోర్టుకు అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) తెలిపారు. అంగళ్లు ఘటనకు సంబంధించి దేవినేని ఉమ, నల్లారి కిషోర్కుమార్ రెడ్డిలపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో తమకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ దేవినేని, నల్లారి.. హైకోర్టులో పిటిషన్ వేశారు. వీరి తరఫున సీనియర్ న్యాయవాదులు పోసాని వెంకటేశ్వర్లు, ఎన్వీ సుమంత్ వాదనలు వినిపించారు. అయతే వివరాలు అందించేందుకు తమకు సోమవారం వరకు సమయం కావాలని ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీంతో వారిని సోమవారం దాకా అరెస్టు చేయబోమని కోర్టుకు అదనపు అడ్వకేట్ జనరల్ తెలియజేశారు. తదుపరి విచారణను ఈనెల 14వ తేదీకి ధర్మాసనం వాయిదా వేసింది.