వైకాపా ప్రభుత్వానికి ప్రజా సమస్యలపై దృష్టి లేదు
ఉపయోగం లేని పథకాలతో ప్రజాధనం వృధా
కాంగ్రెస్ పార్టీ నాయకుడు కృష్ణ పడాల్
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం వృధా చేయడం తప్ప ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి లేదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సాగిన కృష్ణపడాల్ అన్నారు. ఆ పార్టీ మండల అధ్యక్షుడు లకే వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివాసీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంతల గోపీనాథ్, ఎస్టీ సెల్ అల్లూరి జిల్లా అధ్యక్షుడు సూరిబాబులతో కలసి ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం వృధా చేయడంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కరించడం పై లేదన్నారు. గడచిన 17 రోజులుగా అంగన్వాడీలు రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వానికి కనీసం చలనం లేదన్నారు. అంగన్వాడీల సమ్మె కారణంగా అంగన్వాడి కార్యకర్తలతో పాటు, అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధి పొందే వేలాదిమంది అంగన్వాడీ విద్యార్థులు (చిన్నారులు), గర్భిణీలు, బాలింతలు ఇబ్బంది పడుతున్నారన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చింతపల్లి పర్యటనకు వచ్చినప్పుడు అంగన్వాడీల సమస్యలపై స్పందిస్తారని, మన్య ప్రాంతానికి వరాల జల్లు కురిపిస్తారని ఆశించిన మన్య ప్రాంత ప్రజల ఆశలపై నీళ్లు చల్లి కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా చేసి కేవలం ఆయన జన్మదిన వేడుకలు, విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీతో సరిపెట్టారన్నారు. ఉపయోగం లేని పథకాలతో ప్రజాప్రతినిధులను అధికారులను పరుగులు పెట్టించడమే వైకాపా చేస్తున్న హడావుడి తప్ప వాటి వలన ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆయన ఆరోపించారు. వైయస్సార్ పరిపాలనను చూసి వైకాపాకు ప్రజలు ఒక్క అవకాశం ఇచ్చారని, గిరిజన పక్షపాతి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు, మన్య ప్రాంతానికి చేసిందేమి లేదని ఆయన విమర్శించారు. రాబోవు సార్వత్రిక ఎన్నికలలో పాడేరు నియోజకవర్గంలో వైకాపాను ఇంటికి పంపి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఆయన జోష్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.