సమ్మెకు సంఘీభావం తెలిపిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్
విశాలాంధ్ర-ఉరవకొండ : ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంగన్వాడీల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీలను మోసం చేశాడని ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మెకు శుక్రవారం ఉరవకొండలో ఎమ్మెల్యే దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంతో సమానంగా ఆంధ్రాలో కూడా అంగన్వాడీలు జీతాలు పెంచుతానని చెప్పిన ముఖ్యమంత్రి హామీని అమలు చేయడంలో విఫలం చెందారన్నారు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచాలన్నారు. అంగన్వాడీల యొక్క సమ్మెకు రాష్ట్రవ్యాప్తంగా కూడా టిడిపి పార్టీ సంఘీభావం తెలుపుతూ వారికి అండగా నిలిచిందన్నారు. గతంలో టిడిపి పరిపాలనలో అంగన్వాడీలకు జీతాలు పెంచడం జరిగిందన్నారు. రాష్ట్రంలో నియంత, రాక్షస పాలన కొనసాగుతుందని ఇలాంటి పరిపాలనలో పెద్ద సంఖ్యలో అంగన్వాడీ మహిళలు రోడ్డెక్కి ఆందోళనలు నిర్వహించడం సాహసోపేతమైన నిర్ణయమని ఆయన అభినందించారు. రాష్ట్రంలో ఎన్నో ఉద్యమాలను పోలీసులు చేత రాష్ట్ర ప్రభుత్వం అణచివేసిందని అయితే అంగన్వాడి యొక్క పోరాటం రాష్ట్ర ప్రభుత్వాన్ని కదిలించిందన్నారు. మహిళల యొక్క ఉసురు తగిలన ఏ ప్రభుత్వం కూడా మనుగడ సాధించలేదని గతంలో ఇలాంటివి అనేక ఉదాహరణలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఎన్నికల్లో 714 హామీలు ఇచ్చి కేవలం నవరత్నాల పేరుతో ప్రజలను మోసం చేస్తుందని తెలిపారు. ఇంకా 85 శాతం హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. దీనిపై త్వరలోనే శ్వేత పత్రాన్ని కూడా విడుదల చేస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన మరో వంద రోజుల్లో అంతమవుతుందని టిడిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అంగన్వాడీల యొక్క న్యాయమైన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, సిపిఎం నాయకులతో పాటు సిఐటియు యూనియన్ నాయకులు కూడా పాల్గొన్నారు.