తెదేపా పాడేరు నియోజకవర్గం పరిశీలకుడు నారాయణ
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా):-3000 రూపాయల పెన్షన్ పంపిణీలో వైకాపా ప్రభుత్వం ఎందుకు జాప్యం చేస్తుందని తెదేపా పాడేరు నియోజకవర్గ పరిశీలకు రాజమండ్రి నారాయణ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైకాపా అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నేతగా పాదయాత్రలో పెన్షన్ దారులకు ఇచ్చిన హామీని పారదర్శకంగా అమలు చేయడంలో వైఫల్యం చెందాడన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్ పథకాన్ని 3000 చేయకుండా ఏడాదికి 250 రూపాయలు చొప్పున పెంచుతూ పెన్షనర్ల సొమ్మును ఈ ప్రభుత్వం స్వాహా చేసిందన్నారు. నాలుగేళ్లలో 3 వేలకు చేరవలసిన పెన్షన్ పథకం ఐదేళ్లు కావస్తున్నా అమలుకు నోచుకోలేదన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అట్టహాసంగా జనవరి 1 నుంచి పెన్షన్ పథకాన్ని 3000 అందిస్తున్నట్లు ప్రకటించిన వైకాపా సర్కారు జనవరి 4 కావస్తున్నా నేటికీ లబ్ధిదారులకు ఆ పెన్షన్ ఇచ్చేందుకు ఎందుకు జాప్యం చేస్తుందో అర్థం కావడం లేదన్నారు. ఖర్చు చేసే ప్రతి పైసాకు లెక్కలు చెప్పాల్సి వస్తుందని ఈ ప్రభుత్వం వెనకడుగు వేస్తుందని ఆయన ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకుడు గోసరెడ్డి సోమేశ్వరరావు, కార్యకర్తలు పాల్గొన్నారు.