మన్య ప్రాంతంలో తగ్గిన వర్ష పాతం. కనుమరుగవుతున్న శీతలం.
కాలుష్య కోరల్లో చిక్కుకుంటున్న మన్య ప్రాంతం
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలో సహజ సిద్ధంగా ఉన్న వృక్ష సంపద, శీతల వాతావరణం కారణంగా పుష్కలంగా వర్షాలు కురవడం, కాలానుగుణంగా దట్టంగా పొగ మంచు కురుస్తూ మన్యంలో అందాలు పర్యాటకులను విశేషంగా ఆకర్షించడం, ఆహ్లాద కరమైన వాతావరణంతో పాటు పుష్కలమైన ప్రాణ వాయువును అందించే వృక్ష సంపదతో మన్య ప్రాంతం నిత్యం శీతల వాతావరణాన్ని తలపించేది. కానీ ప్రస్తుతం అభివృద్ధిలో భాగంగా రహదారుల విస్తరణ పేరిట ఏపుగా పెరిగిన వందల ఏళ్ల వృక్ష సంపదను అధికారులు, రహదారి నిర్మాణం చేపట్టే గుత్తే దారులు తొలగిస్తుండడంతో వాతావరణ కాలుష్యం ఏర్పడటమే గాక, వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అదే క్రమంలో గత ఏడాది వరకు ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోవడమే గాక, మైనస్ డిగ్రీలుగా నమోదైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ ఏడాది మన్య ప్రాంతంపై ఆ ప్రభావం పూర్తిగా తగ్గింది. వృక్ష సంపద పుష్కలంగా ఉండి నిత్యం శీతల వాతావరణాన్ని తలపించే ఆంధ్ర కశ్మీర్ లంబసింగి (కొర్రు బైలు కూడలి) లో కూడా ఈ ఏడాది ఆ ప్రభావం కనిపించింది. రానున్న ఏడాదిలో ఉష్ణోగ్రతలు డబల్ డిజిట్ ను తగ్గకపోవచ్చని స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.