అరకు సభలో చంద్రబాబు వ్యాఖ్యలను తప్పుబట్టిన జడ్పిటిసి బాలయ్య కో ఆప్షన్ సభ్యుడు నాజర్ వల్లి
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడు ఆ పార్టీ అరకు పార్లమెంట్ స్థాయి సమావేశంలో అడ్డగోలుగా అసత్యాలు మాట్లాడడం ఆయన స్థాయికి తగునా అని వైకాపా స్థానిక జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య, మండల కో ఆప్షన్ సభ్యుడు షేక్ నాజర్ వల్లి లు అన్నారు. మంగళ వారం వారు మాట్లాడుతూ అమాయక గిరిజనులను నమ్మించేందుకు వైకాపా ప్రభుత్వంపై అపనిందలు మోపడం, అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా అమలు సాధ్యం కానీ హామీలను గుప్పించడం ఎంతవరకు సమంజసం అన్నారు. 40 ఏళ్ల ఆయన రాజకీయ జీవితంలో అమలు చేయలేని ఎన్నో బృహత్తర కార్యక్రమాలను వైకాపా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నెరవేర్చి చూపిందన్నారు. వైకాపా ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని, జీవో నెంబర్ 3 ను రద్దు చేసిందని చెప్పడం సబబు కాదన్నారు. గిరిజనులకు నష్టం కలిగించే బాక్సైట్ జీవో 97ను రద్దు చేసిన వైకాపా గిరిజనులకు నష్టం కలిగించే ఏ నిర్ణయాన్ని తీసుకోదన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష, జగనన్న ఆరోగ్య సురక్ష, తదితర కార్యక్రమాలతో ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించడమే గాక, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు వెల్నెస్ సెంటర్లు, నాడు నేడు పేరిట విద్యాలయాలకు నూతన రూపురేఖలు తీసుకురావడం, మారుమూల గ్రామాలకు సైతం రహదారుల నిర్మాణం, గ్రామాలలో వీధులలో నిర్మిస్తున్న సిమెంటు రహదారులు, జలజీవన్ మిషన్ పేరిట త్రాగునీటి కల్పన తదితర కార్యక్రమాలన్నీ అభివృద్ధి కార్యక్రమాలలా ఆయనకు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూడ లేకపోవడం ఆయనకు వయసు రిత్యా వచ్చిన చెత్వారం అని వారు విమర్శించారు. ఇప్పటికైనా ప్రజల మెప్పు పొందాలంటే అసత్యాలు మాట్లాడడం మాని, వాస్తవాలు మాట్లాడాలని వారు హితవు పలికారు.