జడ్పిటిసి పోతురాజు బాలయ్య.
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- వాస్తవాలు రాయడంలో విశాలాంధ్ర పత్రికకు, క్యాలెండర్ రూపకల్పనలో సాటి వేరొకటి లేదని జడ్పిటిసి సభ్యులు పోతురాజు బాలయ్య అన్నారు. విశాలాంధ్ర 2024 క్యాలెండర్ ను స్థానిక పాత్రికేయుడు షేక్ ఖాసిం వల్లి తో కలసి ఆయన ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1952లో స్థాపించబడిన విశాలాంధ్ర దినపత్రిక విజయవాడ కేంద్రంగా విడుదల అయ్యేదన్నారు. ఆ రోజుల్లో ఆ పత్రికకు ఎంతో ఆదరణ ఉండేదన్నారు, రెండు మూడు రోజులైనా ఆ పత్రిక కోసం వేచి చూసే వారమన్నారు. మన్యంలో సిపిఐ పార్టీ చేసిన ఎన్నో ఉద్యమాలను విశాలాంధ్ర దినపత్రిక ద్వారానే తెలుసుకునే వాళ్ళమన్నారు. తాను చదువుకునే రోజుల్లో విశాలాంధ్ర దినపత్రిక చదివి ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగిందన్నారు. నాటినుండి నేటి వరకు ఆ పత్రికకు ఏ మాత్రం ఆదరణ తగ్గలేదన్నారు. ఎన్నో దిన, పక్ష,మాస పత్రికలు వచ్చిపోతున్న గడచిన 70 ఏళ్లకు పైగా ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్న పత్రిక విశాలాంధ్ర అని ఆయన కొనియాడారు. అటువంటి దినపత్రిక, మరో అడుగు ముందుకేసి ప్రతి ఏటా క్యాలెండర్ రూపకల్పనలో తనకు సాటి మరెవరూ లేరనే రీతిగా అందిస్తున్న క్యాలెండర్ ను విశాలాంధ్ర వీరాభిమానిగా తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషంగా ఉందన్నారు.