నెల దాటినా పట్టించుకోకపోవడం దారుణం
రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ధర్నాలు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : గత నెల ప్రారంభంలో మున్సిపల్ కార్మికుల సమ్మెను పురస్కరించుకుని ప్రభుత్వం అంగీకరించిన డిమాండ్ల పరిష్కారానికి నెల దాటినా కనీస చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్వర్యాన మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు చేపట్టారు. దీనిలో భాగంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం డాక్టర్ బీఅర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఆసుల రంగనాయకులు, కడపలో నిర్వహించిన ధర్నాలో యూనియన్ ప్రధానకార్యదర్శి పోరుమామిళ్ల సుబ్బరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సరెండర్ లీవ్ల ఎన్క్యాష్మెంట్ విడుదల ఇంకెప్పుడు చేస్తారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జనవరి 3 నుంచి 10 వరకు మున్సిపల్ కార్మికులు నిర్వహించిన సమ్మె అనంతరం… రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో కొన్ని డిమాండ్లు అంగీకరించింది. వాటిలో ముఖ్యంగా మున్సిపల్ ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించడానికి పదేళ్ల సీనియారిటీ ప్రాతిపదికన తీసుకొని కాంట్రాక్ట్ బేసిక్లోకి మళ్లించి వారిని రెగ్యులరైజ్ స్తామని చెప్పారు. అలాగే సరెండర్ లీవుల సొమ్ము గ్రీన్ ఛానల్లో ఉందని, కేవలం10 రోజుల్లో విడుదల చేస్తామని చెప్పారు. కానీ తాము సమ్మె విరమించి నెల దాటినా ఇంతవరకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోలేదని వారు మండిపడ్డారు. అందువల్లే తప్పనిసరి పరిస్థితుల్లో, ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో నల్ల బ్యాడ్జిలు ధరించి కార్మికులు విధులకు హాజరై… రాష్ట్రమంతా ధర్నాలు చేపట్టామన్నారు. శానిటరీ ఎన్విరాన్మెంట్లోకి మార్చిన డ్రైవర్లకు, యూజీడీ వర్కర్లకు, పార్కుల్లో పనిచేస్తున్న టాయిలెట్ వర్కర్లకు, పెంచిన వేతనాలు వర్తింపజేయాలని కోరారు. సమ్మె ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం కార్మికులకు చెల్లించాల్సిన 1000 రూపాయలు రాష్ట్రంలో ఏ ఒక్క మున్సిపాలిటీ ఇవ్వలేదన్నారు. ఎన్ఎంఆర్లను క్రమబద్ధీకరిస్తామని, ఆ తర్వాత వారికి పీఆర్సీ ప్రకారం వేతనం ఇస్తామని ఆరోజు మినిట్స్లో పొందుపరిచారు… కానీ వారికి ఆ మేరకు వేతనాలు, అలవెన్సులు ఇవ్వలేదన్నారు.
సచివాలయాల వ్యవస్థ వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికులపై అదనపు భారం పడుతున్నదన్నారు. సమ్మె ముగించాలని, యూనియన్ డిమాండ్లు అన్నింటినీ పది రోజుల్లోనే అమలు పరుస్తామని చెప్పిన అధికార యంత్రాంగం… నెల దాటినా కనీసం పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. రెక్కాడితే డొక్కాడని కార్మికుల పట్ల ఇంత నిర్లక్ష్యమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, కార్మికులకు ఇచ్చిన హామీల అమలుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జగన్ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.
నర్సాపురంలో జరిగిన ధర్నాలో ఏఐటీయూసీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జాతీయ సమితి సభ్యులు నెక్కంటి సుబ్బారావు, గుంటూరులో రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ బందెల రవికుమార్, బాపట్లలో వర్కింగ్ ప్రెసిడెంట్ కోటి దాస్, భీమవరంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ మల్లేశ్వరరావు, అనంతపురంలో రాష్ట్ర కార్యదర్శి రాజేశ్గౌడ్, కర్నూలులో ఉపాధ్యక్షుడు పులగం మద్దిలేటి, తిరుపతిలో దొరస్వామి, అమలాపురంలో తాడికొండ వాసు, కాకినాడలో తోక ప్రసాద్, రాజమండ్రిలో దుర్గమ్మ, విశాఖలో సత్యనారాయణ, విజయనగరంలో రాష్ట్ర సమితి సభ్యులు కామేశ్, శ్రీకాకుళంలో కల్యాణి అప్పలరాజు, మదనపల్లెలో సురేశ్ కుమార్, కడపలో తారకరామారావు, నంద్యాలలో అబ్బాస్, రంజిత్, చిత్తూరులో ఉపాధ్యక్షుడు జె.రామచంద్రయ్య పాల్గొన్నారు.