ఎంపీడీవో సాయిబాబు
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమం బాలికలకు వరమని ఎంపీడీవో సాయిబాబు అన్నారు. జాతీయ బాలికల దినోత్సవం పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం బేటి బచావో.. బేటి పడావో కార్యక్రమాన్ని ఐసిడిఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐసిడిఎస్ సిడిపిఓ జివి రమణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాల్యవివాహాలు, వివాహ వ్యవస్థ లపై అవగాహన కలిగించే ఈ కార్యక్రమానికి ఎంపీడీవో సాయిబాబు, అన్ని మతాలకు చెందిన ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై విద్యార్థినిలకు బాల్య వివాహాలు, వివాహ వ్యవస్థ పై అవగాహన కల్పించారు. సమాజాన్ని ప్రభావితం చేయగల నీటి పిల్లలే బావి తరాలకు భవిష్యత్తు నిర్దేశకులన్నారు. యుక్త వయసులో పిల్లల ఆలోచనలు విద్యపై, తాము నిర్ణయించుకున్న భవిష్యత్తు కార్య చరణ పై మాత్రమే ఉండాలి తప్ప ఇతర ఆలోచనల వైపు పెట్టరాదన్నారు. ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉండాలన్నారు. దాన్ని సాధించేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా బాలికలకు 21, బాలురకు 25 సంవత్సరాలు వయస్సు వచ్చే వరకు వివాహానికి దూరంగా ఉండాలని సూచించారు. ప్రతి బిడ్డ చక్కగా చదువుకొని లోకజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని తద్వారా వివాహ వ్యవస్థ బలపడుతుందని చెప్పారు. బాల్య వివాహాల నిర్ములనకు ఉపయోగపడే జీవో నెంబర్ 31, 39 ల గూర్చి చర్చించారు. బాల్య వివాహాలు ఆపడం లో ఎదురయ్యే అవరోధాలు,వాటిని ఎదుర్కోవడానికి అవలంబించే పద్ధతుల గూర్చి విద్యార్థులకు విశదీ కరించారు. ఈ కార్యక్రమంలో హిందూ వివాహ వ్యవస్థ గురించి వై సాయి పంతులు, క్రిస్టియన్ వివాహ వ్యవస్థ గురించి గసాడి శ్యాంశన్ రాంబాబు, ముస్లిం వివాహ వ్యవస్థ గురించి గౌహరున్నీషా, బాల్యవివాహాలు వాటిపై తీసుకునే చర్యలపై మహిళ సంరక్షకురాలు వి రమణమ్మ లు మాట్లాడారు. ఈ సందర్బంగా ఎం పి డీ ఓ సాయి బాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రధాని మోదీ గారి ఆలోచనతో బేటి బచావో.. బేటి పడావో అనే కార్యక్రమాన్ని రూపొందించి, నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇటువంటి కార్యక్రమాలతో విద్యార్థినిలలో సత్ప్రవర్తనతో పాటు మంచి విద్యాధికులుగా ఉండేందుకు ఈ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. ఆడపిల్లలను చదివించడం వలన వారు కూడా కుటుంబ వ్యవస్థ తో పాటు అన్ని రంగాలలో రాణించేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్లు గౌరీ, సత్యవతి, విజయ కుమారి, గౌహరున్నీషా, అంగన్వాడి కార్యకర్తలు అధిక సంఖ్యలో విద్యార్థినులు పాల్గొన్నారు.