. టీడీపీ`జనసేన ఎన్నికల మేనిఫెస్టోలో మరో కీలక హామీ
. 28న ఉమ్మడిగా భారీ బహిరంగ సభ
. సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయం
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహరచన చేస్తున్న తెలుగుదేశం-జనసేన పార్టీలు తమ ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో మరో కీలకమైన అంశాన్ని చేర్చాలని నిర్ణయించాయి. డ్వాక్రా మహిళలకు రుణమాఫీ అమలు చేయాలని నిర్ణయించాయి. రెండు పార్టీల సమన్వయ కమిటీ సభ్యులు విజయవాడలోని నోవాటెల్లో గురువారం సమావేశమై ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇప్పటికే ప్రకటించిన హామీలతో పాటు మహిళలకు ఆర్థిక వెసులుబాటు కల్పించేలా రుణమాఫీ అమలు చేస్తే బావుంటుందని నిర్ణయించారు. అయితే దీనిపై రెండు పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఈనెల 28న రెండు పార్టీల అధ్వర్యాన తాడేపల్లిగూడెంలో భారీ బహిరంగ సభ నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ సభలో దీనిపై కీలక ప్రకటన చేసే అవకాశమున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. సమావేశానికి టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులు కె.అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య పాల్గొనగా, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, కొటికలపూడి గోవిందరావు, బొమ్మిడి నాయకర్, పాలవలస యశస్విని హాజరయ్యారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ రెండుపార్టీల అధినేతలు రాష్ట్రప్రజలకు ఉమ్మడి సందేశం ఇవ్వాలని నిర్ణయించుకున్నారన్నారు. దానిలో భాగంగా రాష్ట్రచరిత్రలో గతంలో ఎన్నడూ జరగనివిధంగా ఈ నెల 28వ తేదీన తాడేపల్లిగూడెం పక్కన పత్తిపాడు గ్రామంలో తెలుగుదేశం- జనసేన పార్టీల ఉమ్మడిసభ నిర్వహించాలని నిర్ణయించామ న్నారు. సభ నిర్వహణకు రెండు పార్టీల నేతలం అంగీకరించామని, తమ పార్టీల వైపు నుంచి మొత్తం 12 మంది సభ్యులు సభా నిర్వహణ ఏర్పాట్లు చేస్తారని, అలాగే టీడీపీ- జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపై రెండు పార్టీల అధ్యక్షులు వీలైనంత త్వరలోనే ప్రకటన చేస్తారని వివరించారు. ఇక సీట్ల సర్దుబాటుపైనా వారే అంతిమంగా నిర్ణయిస్తారన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నుంచి ఉమ్మడి ప్రకటన వెలువడే వరకు ఉభయపార్టీల నేతలు, కార్యకర్తలు గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కలిసి పనిచేయాలని కోరుతున్నామన్నారు. తమ కూటమి ఏర్పాటును జీర్ణించుకోలేకనే సీట్ల కేటాయింపులో అభిప్రాయ భేదాలు ఉన్నట్టు, తమ మధ్య తగువులు పెట్టడానికి జగన్ రెడ్డి, అతని నీలి, కూలి మీడియా ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఈ వాస్తవాన్ని రెండు పార్టీల శ్రేణులు గ్రహించి, జాగరూకతతో వ్యవహరించాలని, అధికారపార్టీ దుష్ప్రచారాలు నమ్మి ఆవేశకావేశాలకు లోనుకావద్దని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఐదు కోట్లమంది ప్రజల భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పనిచేస్తున్నారనే వాస్తవాన్ని అందరూ గ్రహించాలన్నారు. టీడీపీ-జనసేన కలయికను స్వాగతిస్తూ తీర్మానం చేస్తే… జగన్మోహన్ రెడ్డి, అతని ప్రభుత్వం మీడియాపై చేస్తున్న దాడుల్ని నిరసిస్తూ, ప్రజలకోసం.. రాష్ట్రభవిష్యత్ కోసం పాటుపడుతున్న మీడియాసంస్థలకు, ప్రజలకు అండగా నిలవాలని మరో తీర్మానం చేశామని అచ్చెన్నాయుడు వివరించారు.