వాతావరణ మార్పులతో తగ్గిన ఉష్ణోగ్రతలు
పెరిగిన చలి, దట్టంగా కమ్ముకున్న పొగమంచు లతో సోకుతున్న సీజనల్ రుగ్మతలు
అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న వైద్యులు
విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :- మన్య ప్రాంతంలో పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. నిత్యం శీతల వాతావరణానికి పేరెన్నిక గన్న మన్య ప్రాంతంలో గత ఏడాది నవంబర్, డిసెంబర్, ఈ ఏడాది జనవరి మాసాల్లో ఉండ వలసిన చలి, మంచు అంతగా లేవని అనుకుంటున్న తరుణంలో ఈ నెల 15 నుంచి ఉష్ణోగ్రతలు తగ్గుతూ క్రమేపీ చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఒక్క సారిగా చోటు చేసుకున్న వాతా వరణ మార్పులతో శుక్రవారం రాత్రి నుంచి చలి తీవ్రత పెరుగడమే గాక, శని వారం తెల్లవారు జామున దట్టంగా కమ్ముకున్న పొగ మంచు కారణంగా మన్య ప్రాంత ప్రజానీకం ఉక్కిరబిక్కిరయ్యారు. పెరిగిన చలి తీవ్రత, కమ్ముకున్న పొగ మంచు కారణంగా మన్య వాసులు ఉన్ని దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ సమయం ఇళ్లలోనే ఉండవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. అనుకోకుండా మారిన వాతావరణ మార్పులతో మన్య ప్రాంతంలో సీజనల్ రుగ్మతలు (జలుబు, దగ్గు, వైరల్ జ్వరాలు, శ్వాసకోశ, ఉదర, చర్మ సంబంధమైన) ప్రభలు తున్నాయి. ఈ పరిస్థితులపై వైద్యులతో మాట్లాడగా మన్య ప్రాంతంలో ఎప్పటికప్పుడు వాతావరణ మార్పులు సహజమని, సహజ సిద్ధంగా వచ్చే ఇటువంటి మార్పుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి పరిస్థితులలో గర్భిణీలు, బాలింతలు, నవజాత శిశువులు, వృద్ధులు, శ్వాసకోశ, ఉదర, చర్మ సంబంధమైన వ్యక్తులు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉన్ని దుస్తులు వాడడం, కాచి చల్లార్చిన నీటిని త్రాగడం, వేడి వేడి పదార్థాలను భుజించడం అలవాటు చేసుకోవాలని, చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తలెత్తిన వెంటనే సమీపంలోని ఆసుపత్రిలో వైద్యులను సంప్రదించి చికిత్స పొందాలని వైద్యులు సూచిస్తున్నారు.