. 14 నుంచి ఈ`వేలం ప్రారంభం
. స్థలాల విలువ రూ.2 వేల కోట్లు
. వ్యతిరేకిస్తున్న కార్మిక సంఘాలు, వామపక్షాలు
విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ప్రజలు, ఉద్యోగులు, కార్మికులు, ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీలు విరామం లేకుండా 1100 రోజులకు పైగా ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోని మోదీ సర్కారు…అత్యంత విలువైన విశాఖ ఉక్కు భూములపై కన్నేసింది. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో ప్రజలు, రైతులు పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకే కేంద్రం మొగ్గు చూపుతోంది. తాజాగా ఉక్కు స్థలాల అమ్మకం ప్రక్రియను మళ్లీ వేగవంతం చేసింది. పరిశ్రమ పరిరక్షణకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఒత్తిడి చేయకపోవడంతో విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి విశాఖ ఉక్కును గట్టెక్కించ వచ్చు. సెయిల్లో విలీనం చేయడం మరో పరిష్కారమని తెలిసినా కేంద్రం అందుకు చొరవ చూపడం లేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గుచూపుతూ విశాఖ ఉక్కును చంపేయాలని చూస్తోంది. ఇప్పటికే అనేకసార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని ఇప్పుడు వేగవంతం చేసింది. నగరం మధ్యలో అత్యంత విలువైన స్థలాలను ప్లాట్లుగా విభజించి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎన్ఎల్) బ్రోచర్లు విడుదల చేసింది. స్టీలు ప్లాంటు ఏర్పాటుకు రైతుల నుంచి భూసేకరణ చేసిన 19,670 ఎకరాలపై పూర్తి హక్కులు రాష్ట్రపతికి ఉంటాయి. విశాఖ ఉక్కుకు సొంతమని చెప్పుకునేందుకు మద్దిలపాలెం హెచ్బీ కాలనీలో 22.90 ఎకరాలు, గాజువాక ఆటోనగర్లోని రెండెకరాలు, పెదగంట్యాడలోని 434 చదరపు గజాల భూములు ఉన్నాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.2 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఆర్ఎన్ఎల్ విక్రయ సలహాదారుగా పెట్టుకున్న ఎన్బీసీసీ ఈ స్థలాలను ప్లాట్లుగా విభజించి బ్రోచర్ను అధికారికంగా విడుదల చేసింది. చదరపు గజం విలువ పెదగంట్యాడలో రూ.20,500, ఆటోనగర్లో రూ.30-32 వేలు, హెచ్బీ కాలనీలో రూ.74-81 వేలుగా నిర్ణయించారు. వీటి తర్వాత నిరుపయోగంగా ఉన్న ప్లాంటుపై (నాన్ కోర్ అసెట్స్) ఈ సలహాదారు సంస్థ దృష్టి పెట్టనుంది.
పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నాం: జీఎం
ఆర్ఐఎన్ఎల్ నాన్-కోర్ ఆస్తుల విక్రయం కోసం పెట్టుబడిదారుల(ఇన్వెస్టర్స్ మీట్) సమావేశానికి మంచి స్పందన వచ్చిందని స్టీల్ ప్లాంట్ జీఎం ఒక ప్రకటనలో తెలిపారు. నేషనల్ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్, రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ మంగళవారం విశాఖపట్నంలో పెట్టుబడిదారుల సమావేశం నిర్వహించింది. సమావేశం రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ యాజమాన్యంలోని ల్యాండ్ పార్సిల్ బ్లాక్లు/ప్లాట్ల అమ్మకం కోసం నిర్వహించి నట్లు చెప్పారు. సమావేశం ఉద్దేశం ఆర్ఐఎన్ఎల్ ఆస్తి(నాన్-కోర్ ఆస్తులు) గురించి వివరించమే కాకుండా పెట్టుబడిదారులను ఆకర్షించడంతోపాటు కొనుగోలుదారుల అనుమానాలు నివృత్తి చేసేందుకేనని జీఎం చెప్పారు. భూముల కొనుగోలుదారులతో జీఎం జి.రాజారామ్(ఇంజనీరింగ్), ఆర్ఐఎన్ఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జి.గాంధీ మాట్లాడారు. ప్రస్తుతం విశాఖపట్నం లోని హెచ్బీ కాలనీ – మద్దిలపాలెం (11.80 ఎకరాలు), ఆటోనగర్ (2.0 ఎకరాలు), పెదగంట్యాడ (0.089 ఎకరాలు) మొత్తం 13.89 ఎకరాల విస్తీర్ణంలో వేర్వేరు భూమి ప్లాట్లు/బ్లాక్లు కలిగి ఉందని కొనుగోలుదారులకు వివరించారు. 67,277 చదరపు గజాల స్థలం ప్లాట్లు/ బ్లాక్ల రూపంలో మొత్తం 130 నంబర్లతో బిడ్డర్(ల)కి విక్రయించడానికి అందుబాటులో ఉన్నాయి. ఆర్ఐఎన్ఎల్ ఆస్థులను ఈ-వేలం ద్వారా పారదర్శక పద్ధతిలో విక్రయి స్తామని తెలిపారు. హెచ్బీ కాలనీలో ప్లాట్ పరిమాణం 129 నుండి 450 చదరపు గజాల వరకు ఉంటుందని, దాని రిజర్వ్ ధర చదరపు గజానికి రూ.70,200 నుండి రూ.85,800 వరకు ఉంటుందని, మొత్తం 111 ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈఎండీలు సమర్పించడానికి మార్చి 5వ తేదీ గడువు కాగా ఈ-వేలం మార్చి 14వ తేదీన ప్రారంభమవుతుందని చెప్పారు. పెట్టుబడిదారులు, బ్యాంకర్లు, బిడ్డర్లు, డెవలపర్లు, వ్యక్తిగత బిడ్డర్లతో పాటు క్రిడాయ్, వివిధ సంస్థల నుండి భారీ స్పందన వచ్చినట్లు వెల్లడిరచారు.