ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి వాసిరెడ్డి పద్మ రాజీనామా చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రాజీనామా లేఖను పంపించారు. ఎన్నికల సమయంలో పార్టీ కోసం పని చేస్తానన్నారు. మహిళల సాధికారత కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అన్ని తీసుకుంటోందని.. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తాను ఈ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో న్యాయం జరగలేదనే భావం కొందరిలో ఉండొచ్చని.. ఆయన కుటుంబ సభ్యుల్లోనే కొందరికి ఆ అభిప్రాయం ఉండొచ్చన్నారు. కానీ అది నిజం కాదని.. ఈ పార్టీ మహిళల సాధికారత కోసమే పని చేస్తూనే ఉంటుందన్నారు. అంతేకాదు ఎన్నికల్లో బరిలో పోటీ చేయడంపై వాసిరెడ్డి పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధిష్టానం ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించారు. ఎమ్మెల్యేగా బరిలోకి దిగమని చెప్తే సిద్ధమన్నారు. తన స్వస్థలం జగ్గయ్య పేట కాబట్టి అక్కడి నుంచే పోటీ చేస్తాననే అభిప్రాయం ఉండడం సహజం అన్నారు. కానీ పార్టీ అధిష్టానానిదే తుది నిర్ణయమని.. తాను పార్టీకోసం అన్నింటికీ సిద్ధం అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి తన రాజీనామాకు సంబంధం లేదంటూనే పద్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆదిశిస్తే ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని.. తనది కమ్మ సామాజిక వర్గం, తన భర్తది ఎస్సీ సామాజిక వర్గమన్నారు. ఆ కాంబినేషన్లో అధిష్టానం ఆలోచన చేస్తుందన్నారు.. ఏమో గుర్రం ఎగరొచ్చు.. తనకు సీటు రావొచ్చన్నారు. పార్టీ కోసం పనిచేస్తా.. ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటూనే.. వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ ఛైర్పర్సన్ పదవికి రాజీనామా చేశారు.