. బీజేపీతో పొత్తుపై 9న ప్రకటన
. ఐదు ఎంపీ, 9 అసెంబ్లీ సీట్లు కేటాయించే అవకాశం
. దిల్లీ చేరిన చంద్రబాబు, పవన్కల్యాణ్
ఎన్డీఏ కూటమిలో మళ్లీ తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖాయమైంది. ఈనెల 9వ తేదీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
విశాలాంధ్ర బ్యూరో –అమరావతి : ఎన్డీఏ కూటమిలో మళ్లీ తెలుగుదేశం పార్టీ చేరడం దాదాపు ఖాయమైంది. ఈనెల 9వ తేదీ దీనిపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అమావాస్య దాటిన తర్వాత లక్కీ నెంబరుగా భావిస్తున్న 9వ తేదీన బీజేపీతో ఎన్నికల పొత్తు వ్యవహారంపై రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారు. అదే రోజు ఎన్నికల పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించే ఎంపీ, ఎమ్మెల్యే సీట్ల సంఖ్య, పోటీ చేసే స్థానాలు తదితర అంశాలపై కూడా స్పష్టత ఇవ్వనున్నారు. ఈ అంశాలన్నింటిపై బీజేపీ అగ్రనేతలు జేపీ నడ్డా, అమిత్షాలతో చంద్రబాబు చర్చించనున్నారు. ఎన్డీఏ కూటమిలో చేరడం లాంఛనమేనని టీడీపీ, జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గురువారం హైదరాబాద్ బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో దిల్లీకి వెళ్లారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం రాత్రికి దిల్లీ చేరుకున్నారు. రాత్రి 9 గంటల తరువాత అమిత్ షా, నడ్డాలతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ సంయుక్తంగా భేటీ అవుతారు. వీరి భేటీ అనంతరం ఆంధ్రప్రదేశ్లో పొత్తులు, సీట్లపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శుక్రవారం కూడా వీరిద్దరూ దిల్లీలోనే ఉండి సీట్ల సర్దుబాట్లు పూర్తి చేసుకుని తిరిగి వస్తారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. 2014 ఎన్నికల్లో బీజేపీ
టీడీపీ కలిసి పోటీ చేయగా… జనసేన ఎన్నికల్లో పోటీ చేయకుండా టీడీపీ, బీజేపీకి మద్దతు పలికింది. ఆ సమయంలో రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. 2019లో జరిగిన ఎన్నికల్లో ఎవరికి వారు ఒంటరిగా పోటీ చేయగా… వైసీపీ అధికారం చేపట్టింది. ఈసారి ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తొలిదశ అభ్యర్థుల జాబితాను టీడీపీ, జనసేనలు 99 మంది అభ్యర్థులతో ప్రకటించాయి. ఎన్నికల పొత్తులో భాగంగా చంద్రబాబు జనసేనకు 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్ఠానాలు కేటాయించారు. బీజేపీతో పొత్తు ఖరారైన తర్వాత రెండోజాబితాను ప్రకటించేందుకు కూడా ఆ రెండు పార్టీలు కసరత్తు పూర్తి చేశాయి. అలాగే బీజేపీ కూడా ఆయా రాష్ట్రాల్లో పోటీచేసే ఎంపీ అభ్యర్థులతో తొలిజాబితాను ప్రకటించింది. మలి జాబితా విడుదలకు ముందే ఎన్డీఏ కూటమిలో చేరాల్సిన భాగస్వామ్యపక్షాలతో చర్చలు జరిపి, సీట్ల సర్దుబాట్లపై అవగాహనకు రావాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. ఇందులో భాగంగానే చంద్రబాబుకు దిల్లీ పెద్దల నుంచి పిలుపువచ్చింది. ఇక బీజేపీతో పొత్తు ఖరారైతే నాలుగు లేదా ఐదు ఎంపీ స్థానాలు, 9 వరకు అసెంబ్లీ స్థానాలు కేటాయించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీలో ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితోపాటు, మాజీ సీఎం నల్లారి కిరణ్కుమార్ రెడ్డి, జీవీఎల్ నర్సింహారావు, సుజనా చౌదరి, సీఎం రమేశ్, రఘురామకృష్ణంరాజు, సత్యకుమార్ తదితరులు ఎంపీ సీట్లు ఆశిస్తున్నారు.