. పదికి చేరిన వైసీపీ జాబితాలు
. కొలిక్కి వచ్చిన నెల్లూరు, ఒంగోలు, మచిలీపట్నం
. మిగిలిన పార్లమెంటు స్థానాలపై కసరత్తు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా తాజా రాజకీయ సమీకరణలు, సామాజిక బలాబలాల ఆధారంగా అభ్యర్థులను వైసీపీ అధిష్ఠానం ప్రకటిస్తోంది. ఆ తర్వాత నిలిపిన అభ్యర్థికి ఏ మాత్రం సర్వేలో అనుకూలత రాకుంటే వెంటనే మార్చేస్తోంది. తాజాగా శుక్రవారం రాత్రి 11వ జాబితాలో రాజోలు ఇన్చార్జీగా గొల్లపల్లి సూర్యారావు, అమలాపురం పార్లమెంటరీ ఇన్చార్జీగా రాపాక వరప్రసాద్, కర్నూలు పార్లమెంటరీ ఇన్చార్జీగా ఇన్చార్జీగా బీవై రామయ్యలను నియమించింది.
ఈ నెల 7న వైసీపీ విడుదల చేసిన పదవ జాబితాలోనూ సర్వే ఆధారంగానే పేర్లు ప్రకటించింది. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా ప్రముఖ కేన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్రావు పేరును వెల్లడిరచింది. అవనిగడ్డ వైసీపీ ఇన్ఛార్జ్గా సిట్టింగ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేశ్బాబుకు తిరిగి బాధ్యతలు అప్పగించింది. అంతకుముందు జాబితాలో సింహాద్రి చంద్రశేఖర్రావును అవనిగడ్డ అసెంబ్లీ ఇన్ఛార్జ్గా నియమించగా, ఆయన నిరాకరించి, తన తనయుడికి బాధ్యతలు ఇవ్వాలని సీఎం జగన్ను కోరారు. దీంతో సింహాద్రి రమేశ్బాబును మచిలీపట్నం పార్లమెంటు ఇన్ఛార్జ్గా నియమించారు. అనంతరం వచ్చిన సర్వేల ఆధారంగా తిరిగి రమేశ్బాబును అవనిగడ్డకే నియమించారు. పార్లమెంటు అభ్యర్థిగా సింహాద్రి చంద్రశేఖర్కు బాధ్యతలు అప్పగించారు. వైసీపీకి కీలకంగా మారిన కొన్ని పార్లమెంటు స్థానాలపై స్పష్టత వచ్చింది. తొలుత వైసీపీ ఇన్ఛార్జ్ల మార్పులు, చేర్పులతో సిట్టింగ్ ఎంపీలైన వల్లభనేని బాలశౌరి (మచిలీపట్నం), లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసారావుపేట), మాగుంట శ్రీనివాసులురెడ్డి (ఒంగోలు) కు టికెట్లు ఇచ్చేందుకు అధిష్ఠానం నిరాకరించింది. దీంతోపాటు నెల్లూరు వైసీపీ అభ్యర్థిగా ఉన్న రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి పార్టీని వీడి టీడీపీలో చేరడంతో ఆయా స్థానాలపై ఎంపీ అభ్యర్థుల ఎంపిక వైసీపీకి పెద్ద సమస్యగా మారింది. దీంతో వరుస వారీగా దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. అన్నీ ఆలోచించి గెలుపే లక్ష్యంగా అక్కడ ఏకంగా వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డికి సీఎం జగన్ బాధ్యతలు అప్పగించారు. ఇటీవలే ఆయన నెల్లూరుకు భారీ ర్యాలీగా వెళ్లి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి వైసీపీ టికెట్ నిరాకరించడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు. మాగుంటకే ఎంపీ సీటు ఇవ్వాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులురెడ్డి పట్టుపట్టినా ఫలితం లేదు. దీంతో సీఎంకు విధేయుడిగా ఉన్న ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని ఒంగోలు ఎంపీగా బరిలోకి దింపారు. నరసారావుపేట సిట్టింగ్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలను గుంటూరు ఎంపీగా వెళ్లాలని అధిష్ఠానం కోరగా, అందుకు ఆయన నిరాకరించారు. దీంతో నరసారావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన నెల్లూరు ఎమ్మెల్యే పి.అనిల్కుమార్ యాదవ్ పేరును ప్రతిపాదించారు. కీలకంగా ఉన్న ఎంపీలపై స్పష్టత రాగా, మరికొన్ని స్థానాలపై బలమైన అభ్యర్థుల కోసం వైసీపీ పరిశీలిస్తోంది.
మంత్రి పెద్దిరెడ్డికి అదనపు బాధ్యతలు
రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి పార్టీలో అదనపు బాధ్యతలను వైసీపీ అధిష్ఠానం అప్పగించింది. పార్టీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మంత్రి పెద్దిరెడ్డిని అనంతపురం, హిందూపురం, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు తిరుపతి పార్లమెంటు నియోజకవర్గ రీజనల్ కో`ఆర్డినేటర్గా నియమించారు. ఈ మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.