యోగా గురువు రామ్దేవ్ బాబాకి సుప్రీంకోర్టు మంగళవారం మరోసారి సమన్లు జారీ చేసింది. ఆయనను కోర్టు ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. పతంజలి మేనేజింగ్ డైరెక్టర్ ఆచార్య బాలకృష్ణకు కూడా కోర్టు సమన్లు జారీ చేసింది. ప్రజలను తప్పుదారి పట్టించే వ్యాపార ప్రకటనల కేసులో కోర్టు నోటీసులపై ఎందుకు స్పందించలేదో వివరణనివ్వాలంటూ రామ్దేవ్ బాబాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ సంస్థపై కోర్టు ధిక్కార చర్యలు ఎందుకు తీసుకోకూడదని నోటీసుల్లో పేర్కొంది. పతంజలి ఉత్పత్తుల ప్రచారం, వాటి సామర్థ్యానికి సంబంధించిన ప్రకటనల విషయంలో కోర్టు ఇది వరకు ఇచ్చిన ఆదేశాలను ఉల్లఘించడంపై రాందేవ్ బాబా, పతంజలి కంపెనీ సిఇఒ బాలకృష్ణకు గత నెల నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆధునిక వైద్య విధానాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గతేడాది నవంబర్లో విచారణ జరిపిన న్యాయస్థానం .. అసత్య, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ఇవ్వొద్దని పతంజలిని తీవ్రంగా హెచ్చరించింది. దీంతో ఎటువంటి ఉల్లంఘనలు జరగవంటూ అప్పట్లో పతంజలి కోర్టుకు హామీ ఇచ్చింది. హామీని విస్మరించడంతో ఐఎంఎ మరోసారి కోర్టు దృష్టికి తీసుకువచ్చింది.