. పవన్ అయోమయం
. ఎమ్మెల్యే నుంచి ఎంపీగా మార్పు?
. వైసీపీ అష్టదిగ్బంధం
. నేతలకు జగన్ దిశానిర్దేశం
. జనసేన శ్రేణుల కలవరం
. అభ్యర్థుల వెల్లడిలో వెనుకబాటు
. వైసీపీలో చేరిన పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి శేషుకుమారి
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ప్రస్థానం అయోమయంగా మారింది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం అసెంబ్లీ నుంచి బరిలో ఉంటానని ప్రకటించారు. తాజాగా పవన్ అవసరమైతే, బీజేపీ నేతలు సూచిస్తే కాకినాడ ఎంపీగా పోటీ చేస్తాననంటూ వెల్లడిరచారు. ఇవి జనసేన శ్రేణులను అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ పొత్తులో భాగంగా అధికార పంపిణీ, అవసరమైన సీట్ల సాధనలో విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. తొలుత టీడీపీ, జనసేన పొత్తుకు దిగితే, జనసేనకు 40 నుంచి 60 అసెంబ్లీ సీట్లు వస్తాయని ఆ పార్టీ నేతలు భావించారు. అందుకు అనుగుణంగా చాలా నియోజక వర్గాల్లో నేతలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. పొత్తులో భాగంగా తొలుత 24 అసెంబ్లీ, 3 ఎంపీ స్థానాలు తమకు వచ్చినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించి, ఆ తర్వాత బీజేపీ పొత్తుతో అవి కాస్తా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకు కుదించుకుపోయాయి. ఇవి జనసేన నేతలకు మింగుడు పడటం లేదు. చాలా మంది అసంతృప్తితో ఉండి పార్టీని వీడారు. జనసేన పార్టీతో పవన్ సామాజిక వర్గానికి చెందిన కాపులంతా ఏకతాటిపైకి వస్తారని భావించినప్పటికీ, అదీ జరగలేదు. జనసేనలో ఉన్న కాపు నేతలే ఆ పార్టీకి వరుస వారీగా దూరమవుతున్నారు. కిర్లంపూడికి చెందిన కాపు సామాజిక ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఏకంగా వైసీపీలో చేరారు. ఆయన పవన్ను లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. విశాఖ, ఉభయ గోదావరి జిల్లాల నుంచి చాలా మంది జనసేన, ప్రజారాజ్యం పార్టీ మాజీ నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఎన్నికల రాకముందే జనసేన నుంచి చాలా మంది పార్టీని వీడి, పవన్కు షాక్లు ఇచ్చారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ పోటీ చేసే అంశం పైనా తర్జనభర్జన నెలకొంది. అసలు పవన్ పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా?, లేక కాకినాడ నుంచి ఎంపీగా బరిలో ఉంటారా? అనేదీ ప్రశ్నార్థకంగా మారింది. అటు 2019లో రెండు చోట్ల పవన్ పోటీ చేసి ఓటమి పాలయ్యారు. మళ్లీ 2019లో దానిని పునరావృతం చేసేలా వైసీపీ సీరియస్గా కసరత్తు చేస్తోంది.
పవన్ ఓటమిపై వైసీపీ ఫోకస్
పవన్ కల్యాణ్ ఓటమే లక్ష్యంగా వైసీపీ పెద్ద ఎత్తున దృష్టి పెట్టింది. ప్రస్తుతం పిఠాపురం నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా కాకినాడ సిట్టింగ్ ఎంపీ వంగా గీతను పోటీలో ఉంచారు. కాపు సామాజిక వర్గానికి చెందిన వంగీ గీత గతంలో పిఠాపురం నుంచి ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అంతకుముందు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా పని చేశారు. ఆ తర్వాత వైసీపీలో చేరి కాకినాడ ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. పిఠాపురంలో దాదాపు 2 లక్షల 40 వేల మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాపులు 95 వేల మంది, బీసీలో 90 వేల మంది, ఎస్సీలు 30 వేల మంది, మిగిలిన వారంతా ఇతర కులాలకు చెందిన వారున్నారు. పవన్ కల్యాణ్ పోటీలో ఉండటంతో కాపు ఓటర్లపైనే వైసీపీ అధికంగా ఆశించకుండా, మిగిలిన బీసీ, ఎస్సీ ఓటర్లపై దృష్టి పెట్టింది. బీసీలకు చెందిన పద్మశాలి, శెట్టి బలిజ, మత్స్యకారులను చైతన్యవంతులను చేసే దిశగా వైసీపీ రంగంలోకి దిగింది. దీంతో సీఎం జగన్ ఆదేశాల మేరకు పిఠాపురం నియోజకవర్గానికి కీలక నేతలను బాధ్యులుగా నియమించింది. ముఖ్య నేతలకు సీఎం దిశా నిర్దేశం చేస్తున్నారు. మంత్రి దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కన్నబాబుకు చెరొక మండలాలకు బాధ్యతలను అప్పగించింది. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త, ఎంపీ పెద్దిరెడ్డి మిధున్రెడ్డికి పిఠాపురం పట్టణ బాధ్యతలు కేటాయించింది. పిఠాపురం మొత్తం నియోజకవర్గ బాధ్యతలను ముద్రగడ పద్మనాభం, కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి అప్పగించింది. ఒక్క మాట చెప్పాలంటే పిఠాపురం సర్వం జల్లెడ పట్టేలా వైసీపీ నేతలు ప్రణాళిక రూపొందించారు. రాబోయే ఎన్నికల నోటిఫికేషన్ నాటికి అక్కడున్న బీసీలు, ఉపకులాల వారీగా,ఎస్సీ సామాజిక వర్గాలకు ప్రత్యేకంగా నేతలను పంపి వారిని చైతన్యవంతులను చేయనున్నారు. వార్డులు, గ్రామాలకు ఒక ఇన్ఛార్జిని నియమించి, వైసీపీ గెలుపే లక్ష్యంగా పని చేయనున్నారు. పిఠాపురంలో వైసీపీ దూకుడుతో పవన్కు మింగుడు పడటం లేదు.
తలపోటుగా మారిన టీడీపీ నేత వర్మ
మరోవైపు పిఠాపురం పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించడంపై టీడీపీ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే వర్మ, ఆయన అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. పవన్కు మాజీ ఎమ్మెల్యే వర్మ పెద్ద తలపోటుగా మారారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తానని ప్రకటించిన నాడే, పెద్దఎత్తున వర్మ అనుచరులు టీడీపీ జెండాలు, కరపత్రాలను దగ్ధం చేశారు. పవన్పై ఆగ్రహంతో కార్యకర్తలు ఊగిపోయారు. అనంతరం చంద్రబాబుతో పిలుపుతో ఆయనను వర్మ కలిశారు. అక్కడ లోపాయికారి ఒప్పందాల్లో భాగంగా పవన్ గెలుపు కోసం పనిచేస్తానని వర్మ ప్రకటించారు. అదే సమయంలో తాను అవసరమైతే ఎంపీగా పోటీ చేస్తానని, పిఠాపురానికి జనసేనకు చెందిన కాకినాడ ఎంపీ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్ను నిలుపుతానని పవన్ చేసిన వ్యాఖ్యలపై వర్మ మండిపడ్డారు. తాను పవన్ అయితేనే గెలిపిస్తానని, మరొక జనసేన నేత పిఠాపురం వస్తే సహకరించేది లేదని, తానే టీడీపీ తరపున బరిలో దిగుతానని నొక్కి చెప్పారు. అటు అధికార వైసీపీ వ్యూహాలు, ఇటు పొత్తులో భాగంగా టీడీపీ నుంచి వస్తున్న నిరసనలు వెరసి పవన్కు పిఠాపురం గెలుపు పెద్ద సమస్యగా మారింది. ఒకవైపు అధికార వైసీపీ మొత్తం అసెంబ్లీ, పార్లమెంటు సీట్లను ప్రకటించి, ప్రచారంలో ముందజలో ఉంది. జనసేనకు కేటాయించిన 21 సీట్లలో కేవలం ఆరుగురు ఎమ్మెల్యే, ఒక ఎంపీ అభ్యర్థిని ప్రకటించడానికి నానా కష్టాలు పడాల్సి వచ్చింది. మిగిలిన అసెంబ్లీ సీట్లకు సరైన అభ్యర్థులు లేక పవన్ నానా తంటాలు పడుతున్నారు. పార్టీ అధినేతగా ఉన్న పవన్, తాను పోటీ చేసే స్థానంపై అయోమయంలో ఉండటంతో పార్టీ నేతలు నిరుత్సాహానికి గురవుతున్నారు. కనీసం పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చిన సీట్ల కేటాయింపుపై నిరసనలు రావడంతో పవన్కు దిక్కుతోచడం లేదు. అటు పిఠాపురం జనసేన మాజీ ఇన్ఛార్జి మాకినీడు శేషుకుమారి వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎంపీ వంగా గీతతో కలిసి ఆమె సీఎం జగన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేన అభ్యర్థిగా ఆమె పోటీ చేసి ఓటమి పాలయ్యారు.