– శ్రీ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం…
– దేవాలయం అర్చకులకు, పూజారులకు ప్రభుత్వమే రక్షణ కల్పించాలి….
విశాలాంధ్ర – (అనకాపల్లి జిల్లా) చోడవరం : కాకినాడ జిల్లా, కాకినాడ పట్టణంలోని దేవాలయం వీది శివాలయంలో అర్చకులుగా పని చేస్తున్న సాయి శర్మ, విజయ కుమార్ శర్మ లపై ఆలయంలో, భక్తుల మధ్యలో దాడికి పాల్పడడమే కాకుండా, ఆ అర్చకుల పై కాళ్లతో దాడి చేసి, గాయపరిచిన మాజీ కార్పొరేటర్ సిరియాల చంద్రరావు పై కేసు నమోదు చేసి, తక్షణమే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని, అర్చకులకు రక్షణ కల్పించాలని అనకాపల్లి జిల్లా, చోడవరం శ్రీ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం డిమాండ్ చేస్తోంది. అర్చకులు, దేవాలయ పూజారులు పై జరిగిన దాడులను ఖండిస్తూ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు కందర్ప కృష్ణ మూర్తి (కిష్టప్ప), ప్రముఖ న్యాయవాది కందర్ప రామేశం (రమేష్), అధ్యక్షుడు పుట్రేవు శ్యాం ప్రసాద్, కార్యదర్శి వింజమూరి శంకర్ లు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేవాలయం అర్చకుల పై దాడులకు పాల్పడిన వారిని, అసాంఘిక కార్యకలాపాలకు రక్షణగా ఉన్నటువంటి అధికార ప్రభుత్వ పెద్దలపైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొంతకాలంగా దేవాలయాల పైన అర్చక పురోహితులు, బ్రాహ్మణులు పైన నిరంతరం దాడులు జరుగుతున్నాయి అని, ఇది చాలా విచారకరమైనటువంటి విషయమని వారు తెలిపారు. ఇలాంటి దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించి, అర్చకుల పైన పురోహితులు, బ్రాహ్మణులు, వారి ఆడపిల్లల పైన దాడులకు పాల్పడిన వారు ఎంతటి వారైనను, వారిపై పోలీస్ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని, ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నిందితులను అరెస్టు చేయకపోయినా, ఈ సంఘటన పై ఎటువంటి క్రమ శిక్షణ చర్యలు చేపట్టకపోయినను, ఏ.పి.ప్రైవేట్ అర్చక పురోహిత సంక్షేమ సంఘం తరపున ప్రత్యక్ష పోరాటానికి మద్దతు ఇచ్చి, ఉవ్వెత్తున ఉద్యమిస్తామని, తదుపరి చర్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు కోరుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని బ్రాహ్మణ సంఘాలు అర్చక, పురోహిత, బ్రాహ్మణుల ఉద్యమానికి మద్దతు ఇచ్చి, వారి పై దాడులను ఖండించాలని, శ్రీ గణేష్ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం కోరుతుంది. ఈ కార్యక్రమంలో కందర్ప సత్యనారాయణ మూర్తి, కొమ్మనమంచి నరసింహ మూర్తి, ఉపాధ్యాయుల శ్రీనివాసరావు, ట్రస్ట్ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.