Monday, May 20, 2024
Monday, May 20, 2024

ఆపన్నుల ఆకలి తీరుస్తున్న కిల్లాడి అప్పలరాజు

మూడేళ్లుగా పేదలకు సేవలందిస్తున్న బీసీ నేత.
విశాలాంధ్ర – పెందుర్తి: మానవత్వం పరిమళించే మంచి మనిషి అన్న సినీ కవి భావనకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు జీవీఎంసీ 97వ వార్డుకు చెందిన కిల్లాడి అప్పలరాజు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శిగా, సుజాతనగర్ వర్తక సంఘం అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అప్పలరాజు సమాజానికి తనవంతు సేవ చేయాలనే సంకల్పంతో గత మూడేళ్లుగా అన్నార్తుల ఆకలి తీరుస్తూ మానవత్వం ప్రదర్శిస్తున్నారు. ప్రతి బుధవారం సుజాతనగర్ పరిసర ప్రాంతాలలో ఆకలితో అలమటించే బిచ్చగాళ్ళు, పేదలు, సాదు సంపత్తులు సుమారు వందమందికి అన్న సమారాధన చేస్తున్నారు. ఆ ప్రాంతానికి చెందిన సీనియర్ సిటిజెన్ టి .కాంతారావు, కళింగ వెల్పేర్ అసోసియేషన్ సభ్యులు చింతాడ సురేష్, కర్రీ కృష్ణమూర్తిలతో కలిసి స్వయంగా పేదలకు వడ్డించి ఆత్మ సంతృప్తి చెందుతుంటారు. తన ఇంట్లోనే వంటకాలు చేయించి పేదలకు పెట్టడం విశేషం. కాగా వేసవి ఎండలు పెరగడంతో బుధవారం పాదచారులు పేదలకు మజ్జిగ , వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అప్పలరాజు మాట్లాడుతూ తాను చేపట్టిన ఈ బృహత్తర కార్యక్రమాన్ని మరింత విస్తరింప చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బ్రాడ్ వే నర్సింగరావు, తెన్నేటి చిన్ని, కాళ్ళ ఆనంద్, చిక్కాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img