జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఎం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఎన్నికల సంసిద్ధత, తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సమీక్ష నిర్వహించారు.
అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి ఎం.గౌతమి, జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్, జిల్లా పరిషత్ సీఈవో వైఖోమ్ నిదియా దేవి, నగర పాలక సంస్థ కమిషనర్ మేఘ స్వరూప్, డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం రిటర్నింగ్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో హోమ్ ఓటింగ్, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలను పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. హోమ్ ఓటింగ్ ను, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలను త్వరితగతిన పూర్తిచేయాలని, ఇందులో ఎన్నికల కమిషన్ ఫార్మాట్ ను ఫాలో కావాలన్నారు. ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లే పరిస్థితిలో లేని వారికి, 85 ఏళ్ల పైబడిన వారికి, పీడబ్ల్యూడి ఓటర్లకు హోమ్ ఓటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. 85 ఏళ్ల పైబడిన వారిని, పీడబ్ల్యూడి ఓటర్లని పూర్తిగా 100 శాతం బిఎల్వోలు విజిట్ చేయాలన్నారు. ఒకసారి వారు అందుబాటులో లేకపోతే రెండవసారి విజిట్ చేయాలని, పూర్తి ఆధారాలను సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించే సమావేశంలో హోమ్ ఓటింగ్ ప్రక్రియను ఎప్పుడు మొదలు పెడతారో స్పష్టంగా తెలపాలన్నారు. బిఎల్ఓలు, సూపర్వైజర్లు, సెక్టోరియల్ అధికారులకు హోం ఓటింగ్ పై శిక్షణ ఇవ్వాలన్నారు. ఎన్నికల్లో అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ ఎన్నికల సంఘం నోటిఫై చేసిందని, ఎన్నికల తేదీన ఎవరైతే అత్యవసర సేవల ఉద్యోగులు డ్యూటీలో ఉన్నారో వారికి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయుటకు అవకాశం కల్పించారన్నారు. పోస్టల్ బ్యాలెట్ విషయమై ఆయా శాఖల పరిధిలో ఉద్యోగులకు అవగాహన కల్పించాలన్నారు. స్వీప్ యాక్టివిటీలో భాగంగా ఓటర్ గైడ్ పై, ఓటర్ టర్నవుట్ పై అవగాహన కల్పించాలని సూచించారు. నియోజకవర్గ కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్న తాత్కాలిక స్ట్రాంగ్ రూములలో అన్ని రకాల మరమ్మత్తులను వెంటనే చేపట్టాలని, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రిటర్నింగ్ అధికారులు జి.వెంకటేష్, రాణిసుస్మిత, కరుణకుమారి, వి.శ్రీనివాసులు రెడ్డి, వసంతబాబు, రాంభూపాల్ రెడ్డి, సివిల్ సప్లయ్ డిఎం రమేష్ రెడ్డి, డీపీఓ ప్రభాకర్ రావు, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.