. కాంగ్రెస్లో పెరుగుతున్న చేరికలు
. తాజాగా హస్తం గూటికి పూతలపట్టు ఎమ్మెల్యే బాబు
. వైసీపీ అసంతృప్తులపైనే షర్మిల దృష్టి
. ఎన్డీయే కూటమి నేతల సంప్రదింపులు?
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి : ఆంధ్రప్రదేశ్లోని ఇండియా కూటమిలో రోజురోజుకు జోష్ పెరుగుతోంది. ఈ కూటమిలోని ప్రధాన భాగస్వామి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు పెరుగుతున్నాయి. అధికార వైసీపీ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఊపందుకున్నాయి. త్వరలో ఎన్డీయే కూటమికి చెందిన టీడీపీ, జనసేన, బీజేపీ నుంచి కూడా అసంతృప్త నేతలు కాంగ్రెస్ గూటికి రావడానికి సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఏకంగా వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ చెంతకు చేరడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా ఇండియా కూటమికి వస్తున్న ఆదరణ, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే ఇందుకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల దృష్టి పెట్టింది. వారందర్నీ కాంగ్రెస్లో చేర్చేందుకు ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే వైసీపీలో టికెట్లు దక్కక అసంతృప్తితో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరి జగన్ను దెబ్బకొట్టారు.
మరికొందరు వైసీపీ కీలక నేతలూ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎలిజా, ఆర్థర్ కాంగ్రెస్లో చేరారు. తాజాగా షర్మిల సమక్షంలో పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు కాంగ్రెస్లో చేరారు. వైసీపీ ఇన్చార్జిల మార్పులు, చేర్పుల్లో భాగంగా దాదాపు 25 మంది సిట్టింగ్లకు టికెట్లు లభించలేదు. వారిలో చాలామందిని సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడారు. రాబోయే ప్రభుత్వంలో ఎమ్మెల్సీలతోపాటు కీలకమైన నామినేటెడ్ పోస్టులకు హామీ ఇచ్చారు. కర్నూలు సిట్టింగ్ ఎమ్మెల్యే హఫీజ్కు రాజ్యసభ స్థానం ఇస్తామంటూ నంద్యాల వేదికగా జరిగిన మేమంతా సిద్ధం సభలో ప్రకటించారు. టికెట్లు దక్కని ఎమ్మెల్యేలకు పార్టీలో కీలక పదవులు కేటాయించారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు వైసీపీ విజయవాడ నగర అధ్యక్ష పదవి, సంతనూతలపాడు ఎమ్మెల్యేకు ఒంగోలు పార్లమెంటరీ కోకన్వీనర్ బాధ్యతలు అప్పగించారు. దీంతో చాలామంది వెనక్కి తగ్గి పార్టీ కోసం పనిచేస్తున్నారు. మరికొందరు మాత్రం ఇంకా అసంతృప్తితోనే ఉన్నారు.
వారిలో ముగ్గురు సిట్టింగ్లు పార్టీని వీడారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లాకు చెందిన కేంద్ర మాజీమంత్రి కిల్లి కృపారాణి వైసీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్లో చేరారు. షర్మిల బస్సు యాత్ర ముగిసేలోగా మరికొందరు కీలక నేతలు కాంగ్రెస్లో చేరతారని సమాచారం.
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా కాంగ్రెస్లో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. వైసీపీలో చీరాల టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. ఆమంచికి బదులు చీరాల టికెట్ను కరణం బలరామ్ తనయుడుకు జగన్ టికెట్ ఇచ్చారు. పర్చూరు ఇన్చార్జి పదవి నుంచి తొలగించడంతో కలత చెందిన ఆమంచి కృష్ణ మోహన్ ఇటీవల వైసీపీకి రాజీనామా చేశారు. అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆమంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఒకసారి కాంగ్రెస్ నుంచి, మరోసారి స్వతంత్ర అభ్యర్థిగా గెలిచారు.
ఈసారి ఏ పార్టీ నుంచి టికెట్ దక్కకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలా లేక కాంగ్రెస్లో చేరాలా… అనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. అనుచరులతో చర్చించిన తర్వాత దీనిపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. కాపు సామాజికవర్గానికి చెందిన ఆమంచికి చీరాల నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.