మధ్యప్రదేశ్లోని ఇండోర్ లోక్సభ నియోజకవర్గంలో ఏకగ్రీవం చేసుకునేందుకు బీజేపీ అనేక కుయుక్తులకు పాల్పడుతోంది. పోటీలో నిలిచిన ఆర్ఎస్ఎస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ను పోటీ నుంచి తప్పించేందుకు తీవ్ర ఒత్తిడి తీసుకువచ్చింది. అయినా ఆయన లొంగలేదు. నామినేషన్ను ఉపసంహరించుకోవాలని తనపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ తెలిపారు. మాదక ద్రవ్యాలు, ధన బలం, కండ బలంతో కూడిన రాజకీయాలు లేని ఇండోర్ను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పారు. ఎంతటి ఒత్తిడికైనా లొంగబోనని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు కైలాశ్ విజయవర్ఘీయ, రమేశ్ మెండోలా సహా నలుగురు బీజేపీ నేతలు ఏప్రిల్ 27న తనను కలిసి తాను ఎన్నికల్లో పోటీ చేయడాన్ని చూడలేకపోతున్నామని, తిరిగి ప్రచారక్గా పని చేయాలని కోరారని చెప్పారు. తాను అందుకు తిరస్కరించానన్నారు. పోటీ నుంచి విరమింపచేసేందుకు అప్పటి నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నాని చెప్పారు. బీజేపీ అధికార ప్రతినిధి గోవింద్ మలు స్పందిస్తూ ప్రచారం కోసమే ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఆరెస్సెస్ మాజీ ప్రచారక్లు ఏర్పాటు చేసిన జనహిత్ పార్టీకి గుర్తింపు లభించకపోవడంతో, అభయ్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేయాల్సిన కాంగ్రెస్ అభ్యర్థి అక్షయ్ కాంతి బమ్ ని బీజేపీ బలవంతంగా పోటీ నుంచి తప్పించిందని, నోటాకు ఓటు వేయాలని ఇండోర్ ప్రజలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. ఇండోర్లో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసిందని, దేశంలోని అతిశుభ్రమైన నగరాన్ని కలుషితం చేసిందని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు విమర్శిం చారు. తాజా ఎన్నిక ఇండోర్ విలువలకు, బీజేపీ అహానికి మధ్య పోటీగా వర్ణించారు.