ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. జూన్ 4న రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల పరిధిలోని కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 4న ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ర్యాలీలు, ఉరేగింపులకు అనుమతులు లేవని స్పష్టం చేసింది. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా విక్రయాలు, వాడకంపై నిషేధం విధించింది. ఎవరైనా ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. జిల్లాల వారీగా ఎస్పీలు ఉత్తర్వులు జారీ చేశారు. మే 13న పోలింగ్ సందర్భంగా పల్నాడు, మాచర్ల సహా పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది.మరోవైపు.. ఏపీలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కౌంటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. పోలింగ్ తర్వాత అల్లర్లలో పాల్గొన్న వారిపై ఫోకస్ పెట్టి గాలిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 168 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో భద్రతకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
అల్లర్లకు పాల్పడుతున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటికే పలువురిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశారు. మద్యం బాటిళ్లను, సెల్ ఫోన్లను, వాహనాలను పెద్ద సంఖ్యలో స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.