ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అభ్యర్థులను గెలిపించిన వారందరికీ శిరస్సు వహించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని.. తన 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ ఐదేళ్లు చూసిన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. అమెరికాలో ఉండే వాళ్లు కూడా రూ.లక్షలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి సొంత ఊరికి వచ్చి ఓటు వేశారన్నారు. పక్క రాష్ట్రాల్లో కూలీ పనులకు వెళ్లిన వ్యక్తులు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారన్నారు.
రాజకీయాల్లో ఎవరూ శాశ్వతం కాదని.. ఈ ఐదేళ్ల పాలనలో ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ ఎలా ఇబ్బంది పడ్డాయో చూశామన్నారు. ఇంత చరిత్రాత్మకమైన ఎన్నికలు గతంలో తాను ఎప్పుడూ చూడలేదని.. తెలుగు దేశం పార్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఎన్నిక అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు 1983లో 200 సీట్లు వచ్చాయని.. మళ్లీ ఇవాళ ఊహించని విధంగా ఫలితాలు వచ్చాయన్నారు. కూటమికి 55.38 శాతం ఓట్లు వచ్చాయని.. దీంట్లో టీడీపీకి 45.60 శాతం.. 39.37 శాతం ఓట్లు వైఎస్సార్సీపీకి వచ్చాయన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగే ఎన్డీఏ సమావేశానికి తాను వెళుతున్నట్లు చెప్పారు చంద్రబాబు. కమిట్మెంట్, త్యాగాల ఫలితంగానే ఈ గెలుపు సాధ్యమైందన్నారు టీడీపీ అధినేత. ఈ ఐదేళ్లలో ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారని.. ఈ చారిత్రాత్మక విజయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. భేషజాలకు పోకుండా కూటమి పనిచేసిందని.. ఇది తమకేదో అధికారం అనుకోవడం లేదు.. ఒక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. కూటమికి పవన్ కళ్యాణ్ బీజం వేశారని.. పవన్ కళ్యాణ్ను అభినందిస్తున్నాన్నారు. అధికారమదం, దురహంకారంతో ఉంటే ప్రజలు శిక్షిస్తారని.. ఎన్ని త్యాగాలు చేసైనా భవిష్యత్ తరాల కోసం ముందుకు సాగుతామన్నారు.
ఏపీ అసెంబ్లీలో తన సతీమణికి అవమానం జరిగిందని.. అలిపిరిలో తనపై బాంబు దాడి జరిగినా భయపడలేదని.. కానీ ఆ రోజు చాలా బాధపడ్డానన్నారు. అప్పుడే కౌరవ సభలో ఉండనని చెప్పి బయటకు వచ్చానని.. మళ్లీ అసెంబ్లీకి గౌరవ సభ చేసి వస్తానని చెప్పానన్నారు. గతంలో తాను చేసిన శపథాన్ని నిజం చేయడానికి ప్రజలు సహకరించారన్నారు. తాము ఎన్నికల్లో గెలిచామని గంతులేయలేదు.. ఓడిపోయామని కుంగిపోలేదన్నారు. ప్రజల రుణం తీర్చుకుంటామని.. తమను నడిపించే బాధ్యత ప్రజల తీసుకోవాలన్నారు. రాబోయే రోజుల్లో ప్రజల కూడా ఫీడ్ బ్యాక్ ఇవ్వాలని కోరారు. పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీ, అమిత్ షా, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ నేతల్ని అభినందిస్తున్నానన్నారు. కూటమిలో అందరూ కలసికట్టుగా పనిచేశారని.. ఈ విజయం మూడు పార్టీల కార్యకర్తల సమిష్టి కృషి అన్నారు. ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై సమీక్ష చేసుకుంటామన్నారు.