సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
న్యూదిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ గెలిచి ఓడాడని, ఇండియా కూటమి ఓడి గెలిచిందని సీపీఐ జాతీయ కార్యదర్శి డా.కె.నారాయణ వ్యాఖ్యానించారు. రెండు రోజుల పాటు దిల్లీలో జరిగిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశంలో సాధారణ ఎన్నికలపై సమీక్ష జరిగిందని తెలిపారు. సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణతో కలిసి నారాయణ శనివారం విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్లో ఊహించిన పరిణామాలే జరిగాయని, కానీ దేశంలో కొంత భిన్న ఫలితాలు వచ్చాయన్నారు. గతంలో కంటే బీజేపీకి ఓట్లు, సీట్లు తగ్గాయని, స్వయంగా మోదీకి సైతం మెజారిటీ తగ్గిపోయిందని అన్నారు. టీడీపీ, జేడీయూ కారణంగానే ఎన్డీయే ప్రభుత్వం రాగలుగుతోందని నారాయణ చెప్పారు. లౌకిక శక్తులు అన్నీ ఏకతాటిపైకి వస్తే మోదీ ప్రభుత్వం ఉండదన్నారు. గతంలో మోదీ రాజ్యాంగాన్ని మార్చాలని అనుకున్నాడని, ఇప్పుడు రాజ్యాంగం పుస్తకాన్ని పట్టుకొని దానిని కాపాడుతానని చెబుతున్నాడని, ఆయనలోని అపరాధభావనను ఈ ఘటన బహిర్గతం చేస్తోందన్నారు. దేశాన్ని వెనక్కి తీసుకెళ్లేందుకు మోదీ ప్రయత్నిస్తే ఈసారి ఇండియా ఐక్యసంఘటన ఊరుకోబోదన్నారు.