గ్రేటర్ హైదరాబాద్లో ఎక్కడైనా మ్యాన్హోళ్ల మూతలు తెరిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని వాటర్బోర్డు హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘించి ఎవ్వరైనా మ్యాన్హోళ్ల మూతలను తెరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సూచించింది. వర్షాకాలం నేపథ్యంలో.. ఎలాంటి ప్రమాదాలూ జరగకుండా ఉండేందుకు ఈ సూచనలు చేశారు. వాటర్బోర్డు యాక్ట్ -198 9సెక్షన్74 ప్రకారం ఎవరైనా పౌరులు, అనధికార వ్యక్తులు అధికారుల అనుమతి లేకుండా మ్యాన్హోళ్లపై ఉన్న మూత తెరచినా, తొలగించినా నేరం. దీన్ని అతిక్రమించి, ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తారు. నిందితులకు జరిమానా విధించడంతోపాటు కొన్నిసార్లు జైలు శిక్ష కూడా వేసే అవకాశముంది. అయితే నగరంలో ఎక్కడైనా మ్యాన్హోల్ మూత ధ్వంసమైనా, తెరిచి ఉంచినట్లు గమనిస్తే వెంటనే వాటర్బోర్డు కస్టమర్ కేర్ నంబర్ 155313కి ఫోన్చేసి సమాచారమివ్వాలని, దగ్గరలోని వాటర్బోర్డు కార్యాలయాల్లో నేరుగా సంప్రదించాలని ఎండీ సుదర్శన్రెడ్డి సూచించారు. నగరంలో ప్రధానంగా వర్షం వస్తే మ్యాన్హోళ్లలో పడి మృతి చెందిన ఘటనలున్న నేపథ్యంలో వాటర్బోర్డు అప్రమత్తమైంది. మ్యాన్హోళ్లను తెరువకుండా నగరవాసుల్లో అవగాహన కల్పించడంతో పాటు హెచ్చరికలు జారీ చేసింది.