. కేంద్ర బడ్జెట్ తీరుపై ఇండియా నేతల మండిపాటు
. పార్లమెంటు వెలుపల నిరసన
. లోక్సభ నుంచి వాకౌట్
న్యూదిల్లీ : కేంద్ర బడ్జెట్లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపడాన్ని నిరసిస్తూ… కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖడ్గే, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ సహా ఇండియా ఐక్య సంఘటన ఎంపీలు బుధవారం పార్లమెంటు ఆవరణలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు కాంగ్రెస్, టీఎంసీ, సమాజ్ వాదీ పార్టీ, డీఎంకే, వామపక్షాలకు చెందిన ఎంపీలు పార్లమెంట్ మకర్ ద్వార్ కు వెళ్లే మెట్లపై జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. మంగళవారం లోక్సభలో 2024`25 ఆర్థిక సంవత్సరానికి ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ను తీవ్రంగా నిరసించారు. ఈ సందర్భంగా మల్లికార్జున ఖడ్గే మాట్లాడుతూ… ‘ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని, ఎవరికీ న్యాయం జరగలేదు. వారు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడారు కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు. ఇది మోసపూరిత బడ్జెట్. ప్రజలకు అన్యాయం చేశారు’ అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ… ఎన్డీఏ సర్కారు కుర్చీ కాపాడుకునే బడ్జెట్ను ప్రవేశపెట్టడం ద్వారా సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడిచిందని విమర్శించారు. ఈ సందర్భంగా ‘వియ్ వాంట్ ఇండియా బడ్జెట్ ఎన్డీఏ బడ్జెట్ కాదు’, ‘బడ్జెట్లో భారత్కు ఎన్డీఏ ద్రోహం’ వంటి నినాదాలతో కూడిన ప్లకార్డులను ఎంపీలు ప్రదర్శించారు. ఎన్డీఏ ప్రభుత్వం నిన్నటి బడ్జెట్ ద్వారా సమాఖ్య వ్యవస్థను పరిరక్షించే సూత్రాలన్నింటినీ ఉల్లంఘించిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే బడ్జెట్ లక్ష్యమని కేవలం రెండు రాష్ట్రాల (ఏపీ, బీహార్)కే వరాలివ్వడానికు పరిమితమయ్యారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్, బీహార్లకు నిధులు ఇవ్వడానికి తాము వ్యతిరేకం కాదని, ఇతర రాష్ట్రాలకు కూడా న్యాయం జరగాలన్నారు. ప్రజల ఆందోళనకు గురవుతున్నారు కాబట్టే బడ్జెట్ను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ఎస్పీ ఎంపీ జయా బచ్చన్ బడ్జెట్పై మండిపడ్డారు. యువతకు తప్పుడు హామీలు ఇచ్చారన్నారు. తమ రాష్ట్రం ఉత్తరప్రదేశ్పై వివక్ష చూపారని ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ అన్నారు. ఉద్యోగాలు లాక్కొని ఇప్పుడు శిక్షణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లోక్సభలో కాంగ్రెస్ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ… ‘‘బడ్జెట్తో దేశం మొత్తం కలత చెందింది. తమ ప్రాథమిక సమస్యలను పరిష్కరించడంలో బిజెపి విఫలమైందని అన్ని రాష్ట్రాల ప్రజలు కలత చెందుతున్నారు. ప్రభుత్వ బలవంతం ఈ బడ్జెట్లో స్పష్టంగా కనిపిస్తోంది. బడ్జెట్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి నిరసన తెలుపుతోంది’’ అన్నారు. ‘‘మేము ఈరోజు పంజాబ్కు న్యాయం కోసం నిరసనలు చేస్తున్నాము. ఆంధ్రప్రదేశ్, బీహార్లకు అన్నీ కేటాయించారు… పంజాబ్కు వరద సాయం కూడా ఇవ్వలేదు. పంజాబ్ బీజేపీకి ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే ఆ రాష్ట్రాన్ని విస్మరించారు’ అని కాంగ్రెస్ ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ పేర్కొన్నారు. ఆర్ఎస్పి ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ మాట్లాడుతూ… కొన్ని రాష్ట్రాలపై పూర్తి వివక్ష చూపారన్నారు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కొన్ని రాష్ట్రాలకే బడ్జెట్లో ప్రోత్సాహాలు ఇవ్వడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ఉత్తరప్రదేశ్ పేరు కూడా బడ్జెట్లో లేదని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ నిరాశ వ్యక్తం చేశారు. ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు వారు కొందరికి నిధులు ఇస్తున్నారని, ఇతరులను విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ‘మహారాష్ట్రను నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదు’ అని రాసి ఉన్న ప్లకార్డును పట్టుకున్న శివసేన (యుబిటి) ఎంపీ అరవింద్ సావంత్… బడ్జెట్ను కేవలం ఏపీ, బీహార్, ఒడిశా రాష్ట్రాలకు అనుకూలంగా అభివర్ణించారు.
‘‘ఈ బడ్జెట్తో నితీశ్ కుమార్ ,చంద్రబాబు నాయుడు అనే ఇద్దరు వ్యక్తులు తప్ప దాదాపు అందరూ నిరాశ చెందారు. అన్ని ఆర్థిక నివేదికలు ఆదాయం పెరగడం లేదు కానీ దేశంలో ధరలు పెరుగుతున్నాయని తేల్చాయి. దేశంలోని పెట్టుబడిదారులను ప్రభుత్వం స్తంభింపజేసింది… ఈ బడ్జెట్ సమాజంలోని అన్ని వర్గాలను ఆగ్రహానికి గురి చేసింది… ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన జరిమానా విధించే నిబంధనలకు స్వస్తి పలకాలి’’ అని ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా అన్నారు. కాగా తెలంగాణ, కర్నాటక, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు కేంద్ర బడ్జెట్లో తమ రాష్ట్రాల పట్ల వివక్షకు నిరసనగా రాబోయే నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు.
బడ్జెట్ కేటాయింపులపై నిరసన
కేంద్ర బడ్జెట్లో ప్రతిపక్షాలు పాలిత రాష్ట్రాలపై వివక్ష చూపడాన్ని నిరసిస్తూ ఇండియా ఐక్యసంఘటన ఎంపీలు లోక్సభ నుంచి వాకౌట్ చేశారు. బుధవారం ఉదయం సభ సమావేశమైన వెంటనే బడ్జెట్ కేటాయింపుల అంశాన్ని లేవనెత్తేందుకు విపక్ష ఎంపీలు ప్రయత్నించారు. వివక్షాపూరిత బడ్జెట్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలకు అంతరాయం కలిగించవద్దని హెచ్చరించారు. ఇరుపక్షాల సభ్యులు పార్లమెంటరీ సంప్రదాయాలను పాటించాలని ఆయన అన్నారు. ఒక ప్రణాళిక ప్రకారం సభా కార్యక్రమాలు అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలను నిందించారు. కాగా పార్లమెంట్ భవనం మెట్లపై విపక్షాల నిరసన కారణంగా పార్లమెంటు హౌస్లోకి ప్రవేశించడానికి సభ్యులు ఇబ్బంది పడుతున్నారని స్పీకర్తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ధ్వజమెత్తారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కొంతమంది సభ్యులు తనకు లేఖలు రాశారని బిర్లా తెలిపారు. తమ సమస్యను లేవనెత్తేందుకు అనుమతి లేకపోవడంతో విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.