కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కాలేజీలో సీక్రెట్ కెమెరాల కలకలం రేగింది. లేడీస్ హాస్టల్ బాత్రూమ్ లో హిడెన్ కెమెరా బయటపడింది. దీంతో విద్యార్థినులు అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఓ యువతి సాయంతో ఫైనల్ ఇయర్ విద్యార్థి విజయ్ 300 మంది యువతుల వీడియోలు చిత్రీకరించి విక్రయిస్తున్నట్లు సహచర విద్యార్థులు ఆరోపించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కళాశాల వసతి హాస్టల్కు చేరుకున్నారు. పోలీసులు విద్యార్థులను అదుపు చేశారు. జూనియర్, సీనియర్ విద్యార్థులతో చర్చించారు. తెల్లవారుజాము మూడున్నర గంటల వరకు ఆందోళన కొనసాగించిన విద్యార్ధులు, ఆ తర్వాత పోలీసుల జోక్యంతో శాంతించారు. అనంతరం సీక్రెట్ కెమెరాల వ్యవహారం గురించి బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థిని పోలీసులు ప్రశ్నించారు. అతడి ల్యాప్ట్యాప్, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కెమెరా ఏర్పాటులో అతడిని మరో విద్యార్థిని సహకరిస్తోందంటూ పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయం గురించి, బాలికల హాస్టల్లో హిడెన్ కెమెరా గుర్తించారంటూ సామాజిక మాధ్యమం ాఎక్స్్ణ వేదికగా చేసిన పోస్టులను సైతం విద్యార్ధినులు పోలీసులకు చూపించారు. ఈ విషయం వారం రోజుల క్రితమే వెలుగు చూసిందని తెలిపారు. వారం రోజులుగా ఇంత జరుగుతున్నా బాధ్యులపై యాజమాన్యం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.