ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలతో ఎర
విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) :- సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి నేటితో గడువు ముగిస్తుండడంతో శనివారం సాయంత్రం ఐదు గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడనుంది. దీంతో అభ్యర్థులు ఆయా పార్టీల శ్రేణులు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాలతో ఎర వేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రచారాలతో హోరెత్తించిన అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణలు వారపు సంతలలో ర్యాలీలు, రోడ్ షోలు, గ్రామాలు, ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికలకు మరో రెండు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అభ్యర్థులు, ఆయా పార్టీల శ్రేణులు ఓటర్లకు తాయిలాలతో ఎరవేసి ఓట్లు రాబట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది. రాబోవు రెండు రోజులలో అన్ని పార్టీలు, పోటీలో ఉన్న అందరూ అభ్యర్థులు ఆయా పార్టీల శ్రేణులతో, అభిమానులతో ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యేందుకు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు రచిస్తున్నారు.