విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గ్రామ వాలంటీర్ల వద్దనున్న డేటా సేకరణ సెల్ ఫోన్లను సోమవారం అధికారులకు అప్పగించారు. మండలంలోని 22 గ్రామ సచివాలయాలలో విధులు నిర్వహిస్తున్న 421 మంది గ్రామ వాలంటీర్లు, ఆయా సచివాలయ కేంద్రాలకు వెళ్లి సచివాలయాల సిబ్బంది ద్వారా సెల్ ఫోన్, డివైస్, చార్జర్ ల వంటి పరికరాలను సంబంధిత అధికారులకు అప్పగించారు. దీంతో గ్రామ వాలంటీర్లు వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, వికలాంగులకు అందించే పెన్షన్ల పంపిణీకి దూరంగా ఉన్నారు. దీంతో ప్రభుత్వ అధికారులే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పెన్షన్ లబ్ధిదారులు ప్రతినెలా ఒకటో తేదీన అందవలసిన పెన్షన్ అందకపోవడంతో పెన్షన్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ ఎన్నికలు ముగిసే వరకైనా తమ వ్యక్తిగత ఖాతాలకు నేరుగా జమ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నారు.