వైద్యుల సమిష్టి కృషి దీనికి కారణం
అనంత వైద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం వైద్య కళాశాలలోని జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ కు కొత్తగా 4 పీజీ సీట్లు, ఆర్థోపెడిక్స్ కు నాలుగు పీజీ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ మంజూరు చేసినట్లు ప్రిన్సిపాల్ ఆచార్య డాక్టర్ ఎస్ మాణిక్యరావు తెలిపారు. జాతీయ వైద్య మండలి పి జి సీట్ల కొరకు నిర్వహించిన ఇన్స్పెక్షన్ లో అనంత వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన వైద్యశాల నాణ్యత ప్రమాణాలు అత్యంత బాగుండడంతో ఇదివరకు ఉన్న జనరల్ మెడిసిన్ లోని ఐదు పీజీ సీట్లకు మరొక నాలుగు సీట్లను కలిపి మొత్తం తొమ్మిది పీజీ సీట్లను, ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్లో ఇదివరకు ఉన్న మూడు పీజీ సీట్లను ఏడు పీజీ సీట్లకు పెంచడంతో ఇదివరకు ఉన్న 104 పీజీ సీట్లుకు 8 పి జి సీట్లు పెరగడంతో 112 సీట్లకు చేరుకున్నాయి.
గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఇదివరకు తీసివేసిన రెండు పీజీ సీట్లను తిరిగి మంజూరు చేయడం తో గైనకాలజీ పీజీ సీట్లు యధావిధిగా 12 సీట్లకు చేరుకున్నాయి. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు మాట్లాడుతూ ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ఆచార్య డాక్టర్ కె ఎస్ ఎస్ వేంకటేశ్వర రావు, జనరల్ మెడిసిన్ ప్రధాన విభాగాధిపతి ఆచార్య డాక్టర్ భీమసేనాచారి, ఆర్థోపెడిక్ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ ఆత్మారాం, గైనకాలజీ ప్రధాన విభాగాధిపతి డాక్టర్ శంషాద్ బేగం లు వారి సిబ్బంది సహకారంతో పిజి సీట్లు పెరగడం జరిగిందని, వారందరి కృషి అభినందనీయం అని తెలిపారు. ఇంకా రావాల్సిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో న్యూరో సర్జరీ విభాగానికి ఎం సి హెచ్ సీట్లు, పల్మనాలజీ విభాగానికి ఎండి పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు కొరకు ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు నేషనల్ మెడికల్ కమిషన్ బృందంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, రానున్న రోజుల్లో ఆ రెండు విభాగాలకు కూడా సీట్లు మంజూరు అవుతాయని ఆశాభావాన్ని మెడికల్ కళాశాల ఎన్ఎంసి బృందం సభ్యులు డాక్టర్ శ్యాంప్రసాద్, డాక్టర్ పద్మ శ్రావణి, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ ప్రవీణ్ దిన్ కుమార్, డాక్టర్ బసిరెడ్డి ప్రవీణ, డాక్టర్ బి ఎం ఎస్ ప్రసాద్ తదితరులు తెలిపారు. పీజీ సీట్ల పెరుగుదలలో ప్రిన్సిపాల్ మరియు సూపరింటెండెంట్ గారి సహకారాలు, సూచనలు చాలా ఉపయోగపడ్డాయని ఎన్ ఎం సి మెడికల్ కళాశాల బృందం తెలిపింది.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ మాణిక్యరావు ఛాంబర్ లో కేకును కోసి ప్రొఫెసర్లు డాక్టర్లతో సంతోషాన్ని పంచుకున్నారు. సంవత్సరానికి 112 మంది చొప్పున మూడు సంవత్సరాలలో 336 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్యులు అనంత జిల్లాలోని పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించనున్నారని ప్రిన్సిపాల్ హర్షం వెలిబుచ్చారు.