వైసీపీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర- ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గం లో కూడేరు, ఉరవకొండ మండలాల్లో కొంతమంది నాయకులు భూకబ్జాలు, దౌర్జన్యాలు చేస్తున్నట్లు పత్రికల్లో కథనాలు రావడం జరిగిందని ఇలాంటి వారి పట్ల పార్టీ, మరియు ప్రభుత్వం యొక్క పరువు పోతుందని వైఎస్ఆర్సిపి పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై. మధుసూదన్ రెడ్డి అన్నారు. గురువారం ఉరవకొండలో రోడ్లు భవనాల అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కులమతాలకు రాజకీయ పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందిస్తూ పారదర్శకంగా పాలన కొనసాగిస్తుంటే ఉరవకొండ నియోజకవర్గం లోని కొంతమంది నాయకులు భూ కబ్జాలు, దౌర్జన్యాలకు పాల్పడుతూ పార్టీ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారనిపేర్కొన్నారు. పత్రికలలో వచ్చిన వార్తలు పైన వాస్తవమా, అవాస్తవమా అనే విషయాలు కూడా వెల్లడించలేదన్నారు. ఇలాంటి వారి పట్ల పార్టీ పెద్దలు చర్యలు తీసుకోవాలన్నారు 2019 సంవత్సరం నుంచి ఉరవకొండ, కూడేరు మండలాల్లో జరిగిన భూకబ్జాలపైన అక్రమ రిజిస్ట్రేషన్ ల పైన సమగ్ర విచారణ చేపట్టాలన్నారు ఉరవకొండ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో కూడా భూ అక్రమాలు జరిగాయని ఆయన పేర్కొన్నారు. భూమి యొక్క విలువ పెరగడంతో కొంతమంది నాయకులు అక్రమాలు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తాసిల్దార్ కార్యాలయంలో రికార్డుల తారుమారు పైన రిజిస్టర్ కార్యాలయాల్లో దొంగ రిజిస్ట్రేషన్ లను వెలికి తీసి వాటిని చేయించుకున్న వారిపై కఠిన చర్యలు చేపట్టాలన్నారు. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు కూడా ఇలాంటి వాటి పట్ల సమగ్ర విచారణ జరపాలన్నారు. అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు