విశాలాంధ్ర – పెద్దకడబూరు : గ్రామాల్లో బడి మధ్యలో మానేసిన పిల్లలు, బడి బయట పిల్లలను గుర్తించి బడిలో చేర్పించాలని జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఆదేశించారు. బుధవారం పెద్దకడబూరు మండల పరిషత్ కార్యాలయంలో మండల ప్రత్యేక అధికారి వెంకటేశ్వర్లు అధ్యక్షతన పంచాయతీ సెక్రటరీలు, సచివాలయ సిబ్బంది, వాలెంటీర్లకు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం బడి బయట పిల్లలను బడిలో చేర్పించేందుకు ప్రత్యేక క్యాంప్ నిర్వహిస్తుందని, ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ బడి బయట పిల్లలను గుర్తించాలని సూచించారు. అలాగే బడి మధ్యలో మానేసిన పిల్లలను సైతం గుర్తించి పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. మండలంలోని ఆయా గ్రామాల్లో 6 నుండీ 14 సంవత్సరాలలోపు పిల్లలందరూ పాఠశాలల్లోనే ఉండాలని, దీనిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం పెద్దకడబూరులోని శ్రీ వెంకటసాయి పబ్లిక్ స్కూల్, రేయిన్ బో పబ్లిక్ స్కూళ్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం స్కూళ్లను నడపాలని యాజమాన్యాలను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంఈఓ సువర్ణల సునియం, ఈఓఆర్డీ జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.