విశాలాంధ్ర -ఉరవకొండ : రాష్ట్రంలో కుల మతాలకు రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం సంక్షేమ పథకాలను అందిస్తోందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి అన్నారు. శనివారం ఉరవకొండ నియోజకవర్గం విడపనకల్లు మండల కేంద్రంలో గడపగడప కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రతి ఇంటికి వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి,సంక్షేమ పథకాలను వివరించారు. అర్హతే ప్రామాణికంగా, పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వమని,ఏవైనా సమస్యలు ఉన్నా,అర్హులై ఉండి ఎవరికైనా పథకాలు అందకపోయినా వెంటనే తెలియజేయాలన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మాజీ ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు ఆ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు కార్యకర్తలు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు