183వ రోజు ఉక్కు దీక్షలో వక్తలు
విశాలాంధ్ర`కూర్మన్నపాలెం(విశాఖపట్నం) : విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో స్టీల్ప్లాంట్ ఆర్చి వద్ద 183వ రోజు జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో విశాఖ ఉక్కు కర్మాగారం నుంచి సెంటర్ ప్లాంట్ విభాగపు నాయకులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. వీరిని ఉద్దేశించి ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ అజయ్ శర్మ, విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ చైర్మన్ మంత్రి రాజశేఖర్, కో కన్వీనర్ గంధం వెంకట్రావు, సభ్యులు పరంధామయ్య, సీఐటీయూ నగర నాయకులు ఎన్. రామారావు మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా మరింత ఐక్యంగా ఉద్యమాలు నిర్వహించి ప్రతిఘటిం చాలని సూచించారు. ఇదే సమయంలో దిల్లీలో జరిగిన ధర్నాకు సంఫీుభావంగా బీజేపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు అన్నీ తమ పక్షాన నిలిచి మద్దతు తెలియజేశాయన్నారు. ఈ ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మలచి దేశవ్యాప్త ఉద్యమంగా మలచడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉద్యమానికి కేంద్ర ప్రభుత్వం భయపడి దిల్లీలో జరిగిన ధర్నాకు అడుగడుగున నిర్బంధాలను ప్రయోగించిందన్నారు. వీటిని అధిగమించి ధర్నా విజయవంతం అవడం శుభసూచకమన్నారు. ఇదే స్ఫూర్తితో ఈనెల 17న జరిపే పరిపాలనా భవనం ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ దీక్షా శిబిరాల్లో సెంటర్ ప్లాంట్ నాయకులు సత్యనారాయణ, నారాయణరావు, దుర్గాప్రసాద్, పి సోమినాయుడు, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసు, పట్టా రమేష్, శ్రీరామచంద్రమూర్తి, లక్ష్మణ్ కుమార్ తదితరులతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.