బొత్సపై ఏసీబీకి వర్ల రామయ్య ఫిర్యాదు
విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: టీచర్ల బదిలీలో మాజీమంత్రి బొత్స సత్యనారాయణ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ఏసీబీ అధికారులకు టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. బొత్స, ఆయన పీఏ, సహకరించిన అధికారులపై విచారణ చేపట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విజయవాడలో ఏసీబీ అధికారులకు వర్ల రామయ్య సోమవారం ఫిర్యాదు చేశారు. విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ, ఆయన పేషీ అధికారులు, కమిషన్ కార్యాలయ ఉద్యోగులు టీచర్ల బదిలీ పేరుతో ఒక్కో టీచర్ నుంచి మూడు నుంచి ఆరు లక్షల వరకు వసూళ్లకు పాల్పడి రూ.60 కోట్లు దండుకున్నారని వివరించారు. బిడ్డలకు చదువు చెప్పి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయులను మోసం చేయడం సిగ్గుచేటన్నారు. జగన్ కుంభకోణాలతో పోలిస్తే ఇది పెద్దది కాకపోవచ్చని, కానీ విద్యాశాఖలో ఇంత దోపిడీ ఎప్పుడూ జరగలేదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో అవినీతి చేసిన ఏ మంత్రినీ వదిలేదీ లేదని, మహిళామంత్రైనా జైలుకు పోవాల్సిందేనన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఇనగంటి జగదీశ్బాబు, అధికార ప్రతినిధి షేక్ రఫీ, నాయకులు కోడూరి అఖిల్, మల్లికార్జున్ రావు, వల్లూరి కిరణ్ ఉన్నారు.